న్యూఢిల్లీ : దేశంలో కరోనా ముప్పు పెరుగుతున్నది. కొవిడ్ కేసులతో పాటు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేరియంట్ రోజురోజుకు విస్తరిస్తున్నది. ఈ క్రమంలో మళ్లీ సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముప్పును ఎదుర్కొనేందుకు కేంద్రం సన్నద్ధమవుతున్నది. కొవిడ్ కేసుల పెరుగుదల మధ్య గురువారం దేశంలో మెడికల్ ఆక్సిజన్ లభ్యతపై కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ సీనియర్ అధికారులతో చర్చలు జరిపారు.
ఈ సందర్భంగా కొవిడ్ మహమ్మారిపై పోరాటాన్ని బలోపేతం చేసేందుకు అవసరమైన మెడికల్ ఆక్సిజన్ లభ్యత సన్నద్ధతపై చర్చించారు. ప్రస్తుతం ఒమిక్రాన్ కేసుల సంఖ్య నిరంతరం పెరుగుతున్నాయి. కరోనా రెండో దశలో మెడికల్ ఆక్సిజన్కు ఊహించని విధంగా డిమాండ్ పెరిగిన తెలిసింది. మొదటి వేవ్లో ఆక్సిజన్ డిమాండ్ గరిష్ఠంగా 3,095 మెట్రిక్ టన్నులు ఉండగా.. రెండో వేవ్లో దాదాపు 9వేల మెట్రిక్ టన్నులకు చేరింది.
ఈ ఏడాది మేలో మెడికల్ ఆక్సిజన్ సరఫరాను దాదాపు పది రెట్లు పెంచగా.. డిసెంబర్-2019 నుంచి రోజుకు వెయ్యి టన్నుల నుంచి 9600 టన్నులకు పెంచారు. ఇదిలా ఉండగా.. కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ ప్రకారం.. ఇవాళ్టి ఉదయం 8 గంటల వరకు 24 గంటల్లో 180 ఒమిక్రాన్ కొత్త కేసులు నమోదయ్యాయి. కొత్త కేసులతో కలిపి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 961కి చేరింది. ఇందులో అత్యధికంగా 263 కేసులు ఢిల్లీలో, ఆ తర్వాత మహారాష్ట్రలో 252 కేసులున్నాయి.