Chirag Paswan : కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ను చంపేస్తామంటూ ఒక బెదిరింపు పోస్ట్ వచ్చింది. కరుడుగట్టిన తీవ్రవాదులు చిరాగ్ను చంపేస్తారంటూ ఆ పోస్ట్లో ఉంది. దీనిపై చిరాగ్ పాశ్వాన్ కార్యాలయం మంగళవారం కేంద్ర హోం శాఖ కార్యదర్శికి ఫిర్యాదు చేసింది. ఈ బెదిరింపు పోస్ట్పై విచారణ జరపాలని, మంత్రి భద్రతను సమీక్షించాలని ఫిర్యాదులో కోరింది.
లోక్జనశక్తి (రామ్ విలాస్) పార్టీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్కు పోస్టులో ఒక లేఖ వచ్చింది. ‘‘త్వరలోనే కరుడుగట్టిన ఉగ్రవాదులు నిన్ను చంపేస్తారు’’ అంటూ ఆ లేఖలో ఉంది. ఈ లేఖలో మొబైల్ నెంబర్లు కూడా ఉన్నాయి. ఈ లేఖ అందుకున్న కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ కార్యాలయం.. దీనిపై కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు చేసింది. కేంద్ర హోం శాఖ సెక్రెటరీ అలోక్ కుమార్కు ఈ అంశంపై ఫిర్యాదు చేసింది. చిరాగ్ పాశ్వాన్కు వచ్చిన బెదిరింపును ప్రస్తావించింది. ఈ బెదిరింపుపై విచారణ జరపాలని కోరింది.
ఇది ఎక్కడి నుంచి వచ్చింది.. ఆయనకు ఎలాంటి ముప్పు పొంచి ఉంది వంటి వివరాలపై ఆరా తీయాలని కోరింది. అలాగే, వెంటనే చిరాగ్ పాశ్వాన్ భద్రతపై సమీక్షించాలని కూడా లేఖలో కోరింది. ఆయనకు వచ్చిన ఒరిజినల్ బెదిరింపు లేఖను కూడా హోం శాఖకు అందజేసింది. ప్రస్తుతం మంత్రికి జడ్ కేటగిరి భద్రత అందుతోంది. ఈ బెదిరింపుపై సమీక్షించిన అనంతరం అవసరమైతే కేంద్రం అదనపు భద్రత కల్పించే అవకాశం ఉంది.