న్యూఢిల్లీ: కరోనా మళ్లీ విజృంభిస్తోంది. రోజు రోజుకూ కేసుల సంఖ్య శరవేగంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో ఇండియాలో 90,928 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. నిన్నటితో పోలిస్తే, కేసుల సంఖ్య రెండింతలు అధికమయ్యాయి. 24 గంటల్లో రికవరీ అయిన వారి సంఖ్య 19,206 కాగా.. ఇక వైరస్ బారిన పడి 325 మంది ప్రాణాలు విడిచారు. రోజు వారీ పాజిటివిటీ రేటు 6.43 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశంలో 2,85,401 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు వైరస్ నుంచి రికవరీ అయినవారి సంఖ్య 3,43,41,009గా ఉంది. ఇక దేశంలో మహమ్మారికి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,82,876గా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 148.67 కోట్ల మందికి కరోనా టీకాలు ఇచ్చారు.
మంత్రి భారతికి కరోనా..
కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీన్ పవార్కు కరోనా సంక్రమించింది. కోవిడ్ 19 పరీక్షలో పాజిటివ్ రిపోర్ట్ వచ్చినట్లు ఇవాళ మంత్రి భారతి తన ట్విట్టర్లో వెల్లడించారు. ఇంట్లోనే క్వారెంటైన్ అయినట్లు ఆమె చెప్పారు. అయితే గడిచిన కొన్ని రోజులుగా తనను కలిసినవారు కరోనా టెస్టు చేయించుకోవాలని ఆమె సూచించారు. కరోనా నుంచి రక్షణ పొందే చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. దేశవ్యాప్తంగా 26 రాష్ట్రాల్లో 2,630 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదు అయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ చెప్పింది.