న్యూఢిల్లీ: కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయమంత్రి భగీరథ్ చౌదరి రాజస్థాన్లో తన దోసకాయల సాగు కోసం రూ.99 లక్షలకుపైగా మొత్తాన్ని సబ్సిడీగా పొందారు. ఈ రాయితీని ఆయన తాను ఉపాధ్యక్షునిగా పనిచేస్తున్న బోర్డు నుంచే పొందడం విశేషం. ‘ఇండియన్ ఎక్స్ప్రెస్’ ప్రచురించిన కథనంలోని వివరాల ప్రకారం కూచామన్ జిల్లా, పీహ్ గ్రామంలో ‘నేషనల్ హార్టికల్చర్ బోర్డ్(ఎన్హెచ్బీ), వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ, భారత ప్రభుత్వం వారి సహాయంతో’ అనే బోర్డు కలిగిన ఒక విస్తారమైన వ్యవసాయ క్షేత్రం ఉంది. దానిపై లబ్ధిదారుని పేరు దగ్గర ‘మిస్టర్ భగీరథ్ చౌదరి’ అని, సబ్సిడీ మొత్తం 50శాతం(రూ.99, 60,000) అని స్పష్టంగా రాసి ఉంది.
నిరుడు దేశవ్యాప్తంగా అమోదం పొందిన 467 ప్రాజెక్టులలో మంత్రి ప్రాజెక్టు ఒకటి కావడం విశేషం. కేంద్ర మంత్రికి రాయితీ ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తిన వేళ భగీరథ్ చౌదరి ఏఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ తాను మంత్రి కాకముందే తన దోసకాయల సాగు ప్రాజెక్టు కోసం ప్రభుత్వ పథకం కింద రూ.99.03 లక్షల సబ్సిడీని పొందినట్లు తెలిపారు. ఈ విషయంలో తానేమీ దాచలేదని, తనపై వస్తున్న ఆరోపణలను తిప్పికొట్టారు. కాగా ఈ ఉదంతంపై కాంగ్రెస్ నేత పవన్ ఖేరా ‘ఎక్స్’ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ‘ధర్మం ఇంటి నుంచే మొదలవుతుందంటారు.
కానీ బీజేపీకి మాత్రం సబ్సిడీ ఇంటి నుంచే మొదలవుతుందని’ వ్యాఖ్యానించారు. కాగా మంత్రి చేపట్టిన ప్రాజెక్టు వ్యయం రూ.1.99 కోట్లు. ఇందులో లబ్ధిదారు వాటా రూ. 49.8 లక్షలు. మంత్రి ఈ ప్రాజెక్టు కోసం హెచ్డీఎఫ్సీ బ్యాంకు నుంచి రూ.1.49 కోట్లు రుణం తీసుకున్నారని ‘ఇండియన్ ఎక్స్ప్రెస్’ పేర్కొంది. ఈ ఉదంతంపై మంత్రి కార్యాలయ సహాయకుడు స్పందిస్తూ, ఈ ప్రాజెక్టు వివరాలను త్వరలోనే ప్రభుత్వానికి సమర్పిస్తామన్నారు.