గువాహటి: అసోంలో ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానానికి ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ నామినేషన్ దాఖలు చేశారు. రాజధాని డిస్పూర్లో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఆయన నామినేషన్ పత్రాలు సమర్పించారు. నామినేషన్ సమయంలో సోనోవాల్తోపాటు అసోం ముఖ్యమంత్రి హిమాంత బిశ్వశర్మ, బీజేపీ మిత్రపక్షాలైన అసోం గణపరిషత్ (ఏజీపీ) అధ్యక్షుడు అతుల్ బోరా, యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్ (యూపీపీఎల్) అధ్యక్షుడు ప్రమోద్ బోరో కూడా ఉన్నారు.
బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ (బీపీఎఫ్) నాయకుడు బిశ్వజిత్ డైమరీ రాజీనామా చేయడంతో అసోంలో రాజ్యసభ స్థానం ఖాళీ అయ్యింది. రాజీనామా అనంతరం బిశ్వజిత్ డైమరీ బీజేపీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం అసోం అసెంబ్లీ స్పీకర్గా పనిచేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సోనోవాల్ కూడా ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే ఇటీవల ఆయనను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఇప్పుడు ఆయన రాజ్యసభకు పోటీచేస్తున్నారు. అక్టోబర్ 4న రాజ్యసభ ఎన్నిక అనంతరం ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నారు.