న్యూఢిల్లీ: సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) 58వ రైజింగ్ పరేడ్ సందర్భంగా ఇవాళ జరిగిన కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా తేనిని ముఖ్య అతిథి జాబితా నుంచి తొలగించారు. ఆయన స్థానంలో మరో సహాయ మంత్రి నిశిత్ ప్రామాణిక్ హాజరయ్యారు. ఢిల్లీలో జరిగిన పరేడ్లో ప్రామాణిక్ చీఫ్ గెస్ట్గా పాల్గొన్నారు. చివరి నిమిషంలో మంత్రి అజయ్ మిశ్రాను ముఖ్య అతిథి లిస్టు నుంచి తొలగించారు. లఖింపూర్ ఖేరీ ఘటనలో మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. అక్టోబర్ 3వ తేదీన జరిగిన ఘటనలో 4 మంది రైతులు మరణించారు. మంత్రి అజయ్ మిశ్రా పార్లమెంటరీ నియోజకవర్గంలో ఈ ఘటన జరిగింది. అజయ్ మిశ్రాను కేంద్ర మంత్రి పదవి నుంచి తప్పించాలని ఇప్పటికే విపక్షాలు డిమాండ్ చేస్తూనే ఉన్నాయి. అయితే రైజింగ్ డే పరేడ్లో చీఫ్ గెస్ట్గా హాజరుకావాల్సిన మిశ్రాను చివరి నిమిషంలో తప్పించినట్లు తెలుస్తోంది. గడిచిన వారం నార్త్ బ్లాక్లో ఆఫీసుకు వచ్చిన మిశ్రాను ఎందుకు చీఫ్ గెస్ట్ లిస్టు నుంచి తొలగించారో తెలియదు.