న్యూఢిల్లీ : ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్ధి ఎవరో నేడు తేలనుంది. ఢిల్లీలో మంగళవారం రాత్రి ఏడు గంటలకు బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఈ దిశగా ఓ నిర్ణయం తీసుకోనున్నారు. మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు నివాసానికి చేరుకుని ఆయనతో సంప్రదింపులు జరిపారు.
రాష్ట్రపతి అభ్యర్ధి రేసులో వెంకయ్య నాయుడు పేరు కూడా వినిపిస్తన్న నేపథ్యంలో షా, నడ్డా ఆయనతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక అంతకుముందు నడ్డా నివాసానికి చేరుకున్న అమిత్ షా మహారాష్ట్ర సంక్షోభంపై బీజేపీ చీఫ్తో చర్చించారు. మహారాష్ట్ర మంత్రి ఏక్నాథ్ షిండే 26 మంది శివసేన ఎమ్మెల్యేలతో పార్టీపై తిరుగుబాటు బావుటా ఎగురవేయడంతో మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సారథ్యంలో కాషాయ నేతలు పావులు కదుపుతున్నారు.
మహారాష్ట్ర ఎమ్మెల్సీ ఫలితాలు వెలువడినప్పటి నుంచి షిండే తన వర్గానికి చెందిన ఎమ్మెల్యేలతో సూరత్ రిసార్ట్లో క్యాంప్ నిర్వహిస్తుండటంతో మహారాష్ట్రలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి.