న్యూఢిల్లీ: దేశంలో మళ్లీ కరోనా కలకలం రేపుతున్నది. మరోసారి కరోనా వైరస్ విజృంబిస్తున్నది. రోజువారీ కేసుల నమోదు పెరుగుతున్నది. ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళ, ఢిల్లీ, కర్ణాటకలో కరోనా వ్యాప్తి, కేసుల నమోదుపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా దృష్టి సారించింది. కరోనా పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నట్లు తెలిపింది. టెస్ట్, ట్రాక్, ట్రీట్, వ్యాక్సినేషన్, కరోనా వ్యాప్తి నియంత్రణకు అవలంబించాల్సిన పద్ధతులు వంటి ఐదంచెల వ్యూహాన్ని అనుసరించి వైరస్ వ్యాప్తిని నియంత్రించాలని సూచించింది.
కాగా, గురువారం దేశంలో రోజువారీ కరోనా కేసుల నమోదు 7,240కి చేరింది. ఇది బుధవారం (5,233) కంటే 40 శాతం అధికమని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. యాక్టివ్ కేసుల సంఖ్య 32,498కు పెరిగిందని, గత 24 గంటల్లో కరోనా వల్ల 8 మంది మరణించినట్లు పేర్కొంది.
మరోవైపు, దేశంలో ఇప్పటి వరకు మొత్తం కరోనా బాధితుల సంఖ్య 4,31,97,522కు చేరింది. ఇందులో 4,26,40,301 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు 5,24,723 మంది కరోనా వల్ల మరణించినట్లు కేంద్ర గణాంకాలు వెల్లడిస్తున్నాయి.