న్యూఢిల్లీ: ఐసీఎంఆర్ డ్రోన్ రెస్పాన్స్, అవుట్రీచ్ ఇన్ నార్త్ ఈస్ట్ (ఐ- డ్రోన్) కార్యక్రమాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా సోమవారం ప్రారంభించారు. ఇందులో భాగంగా మణిపూర్లోని బిష్ణుపూర్ జిల్లా ఆసుపత్రి నుండి లోక్తక్ సరస్సులోని కరంగ్ హెల్త్ సెంటర్కు కరోనా టీకాలను డ్రోన్ ద్వారా రవాణా చేసినట్లు తెలిపారు. ఈ డ్రోన్ 31 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 15 నిమిషాల్లో చేరిందని చెప్పారు.
దక్షిణ ఆసియాలోనే వాణిజ్యపరంగా వినియోగించిన తొలి డ్రోన్ ఇది అని మన్సుఖ్ మాండవియా వివరించారు. కేవలం వ్యాక్సిన్ల సరఫరా కోసమేగాక భవిష్యత్తులో డ్రోన్ల ద్వారా రక్త నమూనాలు, అవసరమైన మందులను కూడా రవాణా చేస్తామని తెలిపారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 91 కోట్ల వ్యాక్సిన్ డోస్లను ప్రజలకు వేసినట్లు ఆయన వెల్లడించారు.