Lavanya Tripathi | మెగా కోడలు లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘సతీ లీలావతి’ విడుదల వాయిదా పడింది. మలయాళ నటుడు దేవ్ మోహన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి తాతినేని సత్య దర్శకత్వం వహిస్తున్నారు. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ సమర్పణలో దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్పై నాగమోహన్ నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకుంది. నరేష్, వీటీవీ గణేష్, సప్తగిరి, మొట్టా రాజేంద్రన్, జాఫర్ సాదిక్, జోషి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేశారు. మొదటగా మార్చి 6న విడుదల చేయాలని నిర్ణయించారు. అయితే విడుదలకు సమీపిస్తున్న వేళ అనూహ్య పరిణామాలు చోటుచేసుకోవడంతో రిలీజ్ను వాయిదా వేయాల్సి వచ్చిందని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.
దుర్గాదేవి పిక్చర్స్ విడుదల చేసిన ప్రకటనలో, “లావణ్య త్రిపాఠి, దేవ్ మోహన్ ప్రధాన పాత్రల్లో రూపొందిన ‘సతీ లీలావతి’ చిత్రాన్ని మార్చి 6న విడుదల చేయాలని భావించాం. అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల నిర్ణయించిన తేదీన విడుదల సాధ్యంకాలేదు. కొత్త విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తాం. ఎలాంటి రాజీ లేకుండా, ప్రేక్షకుల అంచనాలకు అనుగుణంగా చిత్రాన్ని సిద్ధం చేస్తున్నాం” అని పేర్కొన్నారు. కామెడీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమా వినోదంతో పాటు థ్రిల్లింగ్ అంశాల కలయికగా ఉండబోతుందని సమాచారం. కుటుంబ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని కథను మలిచినట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి. గతంలో ‘భీమిలి కబడ్డీ జట్టు’, ‘శివ మనసులో శ్రుతి’, ‘శంకర’ వంటి చిత్రాలతో ఆకట్టుకున్న దర్శకుడు తాతినేని సత్య ఈసారి పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్ను అందించనున్నారని తెలుస్తోంది.
ఇక లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత విడుదలవుతున్న తొలి చిత్రం కావడంతో మెగా అభిమానుల్లో ఈ సినిమాపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఆమె కొత్త లుక్, పాత్రలోని వైవిధ్యం ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని యూనిట్ నమ్మకంగా చెబుతోంది. ఇప్పటికే విడుదలైన ప్రచార కంటెంట్కు మంచి స్పందన రావడంతో సినిమాపై హైప్ పెరిగింది. వాయిదా వార్త అభిమానులను కొంత నిరాశకు గురి చేసినప్పటికీ, క్వాలిటీ కోసం తీసుకున్న నిర్ణయమని మేకర్స్ స్పష్టం చేయడంతో సినీ ప్రియులు కొత్త రిలీజ్ డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.