న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఈ నెల 31న అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నది. ఈ మేరకు అన్ని పార్టీలకు సమాచారం చేరవేస్తున్నది. జనవరి 31 మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో ప్రధానంగా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలపై చర్చించనున్నారు. ఈ నెల 31న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అనంతరం ఆర్థిక సర్వేను సభలో ప్రవేశపెట్టనున్నారు. అనంతరం రాష్ట్రపతి పార్లమెంట్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
ఆ తర్వాత బీజేపీ పార్లమెంటరీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం కానుంది. అనంతరం ఎన్డీఏ ఫ్లోర్ లీడర్స్ సమావేశమవుతారు. ఆ తర్వాత మధ్యాహ్నం మూడు గంటలకు ఆల్పార్టీ మీటింగ్ జరుగుతుంది. ఈ అన్ని సమావేశాలకు ప్రధాని నరేంద్రమోదీ హాజరుకానున్నారు. ఈ వివరాలను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. ఆల్ పార్టీ మీట్లో బడ్జెట్ సెషన్లో చర్చింబోయే అంశాల గురించి ప్రతిపక్షాలకు సూచనప్రాయంగా తెలియజేయనున్నారు.
అదేవిధంగా బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగేందుకు విపక్షాలు సహకరించాలని కోరనున్నారు. కాగా, గత రెండు పార్లమెంట్ సెషన్లలో ఎలాంటి చర్చకు అవకాశం ఏర్పడలేదు. వర్షాకాల సమావేశాలు పెగాసస్ మాల్వేర్పై ప్రతిపక్షాల ఆందోళనల మధ్యే ముగిశాయి. శీతాకాల సమావేశాల్లో లఖింపూర్ ఖేరీ ఘటన నిందితుడి తండ్రి, కేంద్రమంత్రి అజయ్ మిశ్రా రాజీనామా కోసం విపక్షాలు పట్టుబట్టడంతో చర్చకు ఆస్కారం లేకుండా పోయింది.
కాగా, పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రెండు విడుతల్లో జరుగనున్నాయి. తొలి విడుత జనవరి 31 నుంచి ఫిబ్రవరి 11 వరకు, రెండో విడుత మార్చి 14 నుంచి ఏప్రిల్ 8 వరకు కొనసాగనున్నాయి. మార్చి 18న హోలీ సెలవు. ఫిబ్రవరి 1న పార్లమెంట్ ఉభయసభల్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.