మోదీ సర్కారు సామాన్యులను పన్నులతో పిండేసింది.
గత పదేండ్లలో ప్రత్యక్ష పన్ను వసూళ్లు మూడింతలకు పెరిగాయని బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటనే ఇందుకు సాక్ష్యం.
ఈ దశాబ్దకాలం పేద, మధ్యతరగతి జేబులు నిల్.. ఖజానా ఫుల్ అన్నట్టు సాగింది మరి. మొత్తానికి సంక్షేమ పాలన అంటూ సగటు మనిషికి పన్ను పోటేసింది కేంద్ర ప్రభుత్వం.
Budget | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: ఎడాపెడా పన్నులతో విరుచుకుపడుతున్నది కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు. సామాన్యుల ముక్కు పిండిమరీ ఖజనాను నింపేసుకుంటున్నది. ఏటేటా ట్యాక్స్ రెవిన్యూ లక్ష్యాలను పెంచుకుంటూపోతూ పేద, మధ్యతరగతి వర్గాల నడ్డి విరుస్తున్నది. లోక్సభ ఎన్నికల ముందు.. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2024-25)గాను గురువారం పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా తమ హయాంలో పన్ను వసూళ్లు భారీ ఎత్తున పెరిగాయని ప్రకటించారు. గడిచిన పదేండ్లలో ప్రత్యక్ష పన్ను వసూళ్లు మూడింతలకుపైగా పెరిగినట్టు వెల్లడించారు. దీంతో బీజేపీ ప్రభుత్వ పాలనలో ప్రజలపై పన్నుల భారం ఏ రీతిలో పడిందో చెప్పకనే చెప్పారు. ఫలితంగా ధరలు పెరుగుతున్నాయని మోత్తుకున్నా పట్టించుకోని కేంద్రం.. పన్నులను పెంచుతూ సగటు మనిషి ఆశల్ని చిదిమేసిందన్న విమర్శలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి.
వచ్చే ఆర్థిక సంవత్సరం (2024-25) స్థూల పన్ను ఆదాయాన్ని రూ.38.31 లక్షల కోట్లుగా బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. ఈ ఆర్థిక సంవత్సరం (2023-24)తో పోల్చితే ఇది 11.46 శాతం ఎక్కువ కావడం గమనార్హం. ఇక 2024-25లో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు 11.6 శాతం పెరగవచ్చని అంచనా. జీఎస్టీ కలెక్షన్స్ రూ.10.68 లక్షల కోట్లుగా నమోదు కావచ్చని భావిస్తున్నారు. ఈసారి కంటే ఇది రూ.1.1 లక్షల కోట్లు అధికం. 2023-24లో రూ.9.57 లక్షల కోట్లుగా జీఎస్టీ వసూళ్లు ఉంటాయని గత బడ్జెట్లో అంచనా వేశారు. మొత్తం రూ.38.31 లక్షల కోట్ల అంచనాలో ప్రత్యక్ష పన్నుల (వ్యక్తిగత ఆదాయ పన్ను, కార్పొరేట్ ట్యాక్స్) వాటా రూ.21.99 లక్షల కోట్లుగా ఉండొచ్చని, పరోక్ష పన్నుల (కస్టమ్స్, ఎక్సైజ్ సుంకాలు, జీఎస్టీ) వాటా రూ.16.22 లక్షల కోట్లుగా ఉండొచ్చని బడ్జెట్లో పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24) కూడా బడ్జెట్ అంచనాను మించి స్థూల పన్నుల ఆదాయం దాదాపు రూ.76,000 కోట్లు ఎక్కువగా ఉండొచ్చని కేంద్రం భావిస్తున్నది. గత ఏడాది ఫిబ్రవరి 1న ప్రకటించిన బడ్జెట్లో స్థూల పన్ను ఆదాయాన్ని రూ.33.61 లక్షల కోట్లుగా అంచనా వేశారు. తాజా బడ్జెట్లో రూ.34.37 లక్షల కోట్లకు పెంచారు. ఈ నేపథ్యంలో వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఇంతకు సుమారు రూ.4 లక్షల కోట్లు పెంచి అంచనాలు వేయడం గమనించదగ్గ అంశం.
2023-24 బడ్జెట్ అంచనాల మేరకే కార్పొరేట్ ట్యాక్స్ కలెక్షన్స్ ఉంటాయనుకుంటున్నా.. వ్యక్తిగత ఆదాయ పన్ను వసూళ్లు మాత్రం చాలావరకు పెరుగుతాయన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. బడ్జెట్ అంచనాలకు మించి రూ.1.20 లక్షల కోట్లకుపైగా ఉండొచ్చని చెప్తున్నారు. కస్టమ్స్, ఎక్సైజ్ సుంకాల వసూళ్లు కూడా ఈసారి రూ.2.19 లక్షల కోట్లకు, రూ.3.08 లక్షల కోట్లకే పరిమితం కావచ్చంటున్నారు. దీన్నిబట్టే పన్ను పరిధిలోకి ప్రజల్ని ఏ స్థాయిలో కేంద్రం తీసుకువస్తున్నదో అర్థం చేసుకోవచ్చంటున్నారంతా ఇప్పుడు. కార్పొరేట్ ట్యాక్స్, కస్టమ్స్, ఎక్సైజ్ సుంకాలను కాదని, వ్యక్తిగత ఐటీ వసూళ్లపైనే కేంద్రం దృష్టి పెడుతున్నది మరి. ఇక 2014 నుంచి చూస్తే జీఎస్టీ వసూళ్లు రెండింతలైనట్టు ఆర్థిక మంత్రి చెప్తున్నారు. ఆయా వస్తూత్పత్తులపై పెరిగిన పన్నుల భారం, పన్ను పరిధిలోకి కొత్తగా తెచ్చిన వాటికి ఇది నిదర్శనంగా నిలుస్తున్నది.
2009-10 వరకు రూ.25,000దాకా ఉన్న వివాదాస్పద ప్రత్యక్ష పన్ను డిమాండ్లను ప్రభుత్వం ఉపసంహరించుకున్నది. 2010-11 నుంచి 2014-15 మధ్య వచ్చిన వివాదాస్పద ప్రత్యక్ష పన్ను డిమాండ్లలో రూ.10,000 వరకుండే వాటినీ వెనక్కి తీసుకుంటామని మంత్రి చెప్పారు. ఈ నిర్ణయం కోటి మంది పన్ను చెల్లింపుదారులకు ఊరటనిస్తుందన్నారు. పన్ను చెల్లింపుదారులకు మెరుగైన సేవల్ని అందించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామన్న మంత్రి.. మిగతా డిమాండ్ల పరిష్కారానికీ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
బడ్జెట్లో స్టార్టప్లు, పెన్షన్ ఫండ్స్ కోసం పన్ను ప్రోత్సాహకాలను పొడిగించారు. వచ్చే ఏడాది మార్చి ఆఖరుదాకా పన్ను మినహాయింపులు కొనసాగుతాయి. సావరిన్ వెల్త్ లేదా పెన్షన్ ఫండ్స్ పెట్టుబడులపైనా ఇది వర్తిస్తుంది. అలాగే ఈ ఏడాది మార్చి 31తో గడువు తీరిపోతున్న కొన్ని ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ (ఐఎఫ్ఎస్సీ) యూనిట్ల ఆదాయంపైనా పన్ను మినహాయింపులుంటాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. కాగా, ఇప్పటిదాకా దేశంలో 1.17 లక్షల స్టార్టప్లను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఇందులో అర్హత ఉన్నవాటికి స్టార్టప్ ఇండియా యాక్షన్ ప్లాన్ కింద ఆదాయ పన్ను ప్రయోజనాలు, ద్రవ్యేతర ప్రోత్సాహకాల వంటివి అందుతాయని తన ప్రసంగంలో మంత్రి తెలియజేశారు.
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ)కు తలుపుల్ని మోదీ సర్కారు బార్లా తెరుస్తున్నది. విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు మరిన్ని దేశాలతో ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందాలను చేసుకోవడానికి ప్రభుత్వం చర్చలు జరుపుతున్నట్టు బడ్జెట్ ప్రసంగంలో మంత్రి నిర్మలా సీతారామన్ తెలియజేశారు మరి. ఈ క్రమంలోనే 2014-23 మధ్య తమ ప్రభుత్వ హయాంలో దేశంలోకి 596 బిలియన్ డాలర్ల ఎఫ్డీఐ వచ్చినట్టు ప్రకటించారు. గత యూపీఏ పాలన (2005-14)తో పోల్చితే రెట్టింపైనట్టు పేర్కొన్నారు. అయితే ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా అంటూ ఊదరగొట్టే కేంద్రం.. విదేశీ సంస్థలకు దేశీయ మార్కెట్ను ఇలా ఎఫ్డీఐల సాకుతో గంప గుత్తగా అప్పగిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయిప్పుడు.
ఈసారి బడ్జెట్ను పన్నుల జోలికి వెళ్లకుండానే ముగించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. అటు ప్రత్యక్ష, ఇటు పరోక్ష పన్నులలో ఎటువంటి మార్పులు చేయలేదని స్పష్టం చేశారు. దిగుమతి సుంకాలూ యథాతథమేనన్నారు. అయితే ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేవారి సంఖ్య మాత్రం 2013-14 నుంచి గమనిస్తే 2.4 రెట్లు పెరిగిందని చెప్పారు. ట్యాక్స్ రిటర్నుల ప్రాసెసింగ్ సమయం 10 రోజులకు తగ్గిందన్నారు. 2013-14లో ఇది 93 రోజులుగా ఉన్నట్టు గుర్తుచేశారు. దీనివల్ల ట్యాక్స్ రిఫండ్స్లో వేగం పెరిగిందని చెప్పుకొచ్చారు.
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ పదేండ్ల పాలనలో పేదల సొంతింటి కల నేరవేరలేదు. ఇప్పుడు లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే వచ్చే ఐదేండ్లలో 2 లక్షల ఇండ్లు నిర్మిస్తామని బడ్జెట్లో ప్రకటించారు.
-పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, పౌర సంబంధాల శాఖల మంత్రి
కేంద్రం తెలంగాణకు మొండి చెయ్యి చూపింది. రాష్ట్ర విభజన సందర్భంగా పొందుపర్చిన బయ్యారం ఉకు ఫ్యాక్టరీ ఊసే లేదు. వరంగల్ కోచ్ ఫ్యాక్టరీని ప్రారంభించకుండా యాక్సిల్ అండ్ వీల్ అనే పరిశ్రమను స్థాపిస్తామని చెప్పడం కంటి తుడుపు చర్యే.
– కూనంనేని సాంబశివరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి
ఈ బడ్జెట్లో సుందరమైన భాషతో అందమైన అబద్ధాలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. పన్ను వ్యవహారంలో కార్పొరేట్ రంగానికి పెద్దపీట వేశారు. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో.. బడ్జెట్ అదేవిధంగా ఉన్నది.
– కే నారాయణ, సీపీఐ జాతీయ కార్యదర్శి
కేంద్ర బడ్జెట్పట్ల ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఏమాత్రం సంతోషంగా లేరు. ఆదాయపు పన్ను రేట్లను సవరించకుండా, రాయితీలను పెంచకుండావేతన జీవులను కేంద్రం మోసం చేసింది. ఉద్యోగులపట్ల కనికరం చూపని నిర్మలా సీతారామన్.. కార్పొరేట్లకు అనుకూల నిర్ణయాలు తీసుకోవడం విడ్డూరంగా ఉన్నది.
– జంగయ్య, చావ రవి, టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు
ఉద్యోగులు ఆశించిన ఒక్క వెసులుబాటుకూ కేంద్రం బడ్జెట్లో చోటు కల్పించకపోవడం దారుణం. మూడేండ్లుగా ఆదాయపు పన్ను పరిమితి రూ.10 లక్షలకు పెంచాలని గొంతెత్తినా పట్టించుకోకపోవడం శోచనీయం. ఈ బడ్జెట్ ప్రతిపాదనకు సవరణలు చేసి, పన్నుల భారం తగ్గించి, ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు ఉపశమనం కలిగించాలి.
– కటకం రమేశ్, టీఆర్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు
మధ్యంతర బడ్జెట్ పూర్తిగా విద్యా రంగాన్ని, రాష్ట్ర విద్యార్థి లోకాన్ని విస్మరించింది. విభజన హామీ చట్టం ప్రకారం తెలంగాణలో ఏర్పాటు చేయాల్సిన ట్రిపుల్ ఐటీ, ఐఐటీ, ఐఐఎం, జిల్లాకో నవోదయ పాఠశాల గురించి బడ్జెట్లో లేకపోవడం బీజేపీ కక్షపూరిత తీరుకు నిదర్శనం.
– ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి, ప్రధాన కార్యదర్శి పుట్ట లక్ష్మణ్