న్యూఢిల్లీ, మార్చి 7: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు మోదీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉద్యోగుల డీఏ(కరవు భత్యం)ను, పెన్షనర్ల డీఆర్ను 4 శాతం పెంచింది. దీంతో ఇప్పటివరకు జీతం/పింఛన్లో 46 శాతంగా ఉన్న డీఏ/డీఆర్ ఇప్పుడు 50 శాతానికి చేరుకుంది. ఈ ఏడాది జనవరి 1 నుంచే ఈ నిర్ణయం అమలులోకి రానుంది. పెరిగిన ధరల దృష్ట్యా డీఏ/డీఆర్ పెంచాలని తాజా క్యాబినెట్ సమావేశంలో నిర్ణయించినట్టు కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. డీఏ పెంపు వల్ల 49.18 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, డీఆర్ పెంపుతో 67.95 లక్షల మంది పెన్షనర్లకు లాభం చేకూరనుంది. కేంద్రంపై ఏడాదికి రూ.12,869 కోట్ల భారం పడనుంది. 2024- 25(2024 జనవరి నుంచి 2025 ఫిబ్రవరి వరకు)లో రూ.15,014 కోట్ల భారం పడుతుంది. 7వ సెంట్రల్ పే కమిషన్ సిఫార్సుల ఆధారంగా కేంద్రం డీఏ పెంపు నిర్ణయం తీసుకున్నది.
ప్రధానమంత్రి ఉజ్వల యోజన(పీఎంయూవై) ద్వారా గ్యాస్ కనెక్షన్లు పొందిన మహిళలకు కూడా కేంద్రం శుభవార్త చెప్పింది. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్పై ఇస్తున్న రూ.300 సబ్సిడీని వచ్చే ఆర్థిక సంవత్సరం కూడా కొనసాగించాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది. ఏడాదికి 12 సిలిండర్లకు ఈ సబ్సిడీ వర్తిస్తుంది. గత ఏడాది అక్టోబరు వరకు రూ.200 సబ్సిడీ ఇచ్చిన కేంద్రం తర్వాత రూ.300కు పెంచింది. ఈ నిర్ణయం ద్వారా దాదాపు 10 కోట్ల మందికి లబ్ధి కలగనుండగా ప్రభుత్వంపై ఏడాదికి రూ.12,000 కోట్ల భారం పడుతుంది.
2024 – 25 సీజన్కు గానూ ముడి జనపనార కనీస మద్దతు ధరను రూ.285 పెంచుతూ కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. దీంతో ముడి జనపనార కనీస మద్దతు ధర రూ.5,335కు చేరుకుంది.
ఈశాన్య రాష్ర్టాల్లో పారిశ్రామిక అభివృద్ధి కోసం కేంద్రం ‘ఉన్నతి’ పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించనుంది. రూ.10,037 కోట్లు కేటాయిస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. గోవా అసెంబ్లీలో షెడ్యూల్డ్ తెగలకు(ఎస్టీ) రిజర్వేషన్లు కల్పించే బిల్లును క్యాబినెట్ ఆమోదించింది. సార్వత్రిక ఎన్నికల తర్వాత ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు.
ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధ(ఏఐ)కి ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రూ.10,372 కోట్లతో ఏఐ మిషన్ ప్రారంభించాలని నిర్ణయించింది. ఐదేండ్ల పాటు ఏఐ మిషన్ కార్యక్రమం కోసం ఈ నిధులను ఖర్చు చేయనున్నది. ఈ నిధులతో ప్రభుత్వం 10 వేల జీపీయూ సామర్థ్యంతో కూడిన సూపర్ కంప్యూటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసి ఏఐ ఆవిష్కరణల కోసం పని చేసే స్టార్టప్లు, ఔత్సాహికులు, పరిశోధకులకు అందుబాటులోకి తీసుకురానున్నది.