Union Cabinet | ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేబినెట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ఎమర్జెన్సీ బాధితులకు నివాళిగా రెండు నిమిషాల పాటు మౌనం పాటించి.. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా తీర్మానాన్ని ఆమోదించింది. శుభాంశు శుక్లాతో కూడిన మిషన్ విజయవంతంగా అంతరిక్షంలోకి ప్రవేశించడాన్ని స్వాగతించింది. మరో తీర్మానానికి ఆమోదం తెలిపిన మంత్రివర్గం పుణె, ఆగ్రాలలో పలు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మంగళవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో అత్యవసర పరిస్థితి ప్రకటనకు 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కేంద్ర మంత్రివర్గం తీర్మానాన్ని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చదివి వినిపించారు. ‘ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం ఈ రోజు అత్యవసర పరిస్థితిపై పోరాడిన లెక్కలేనన్ని మంది త్యాగాలను గుర్తుంచుకోవాలని నిర్ణయించింది. రాజ్యాంగాన్ని హత్య చేసే ప్రయత్నాన్ని విఫలం చేసిన ఈ ప్రజాస్వామ్యవాదులకు కేంద్ర మంత్రివర్గం నివాళులర్పించింది’ అని పేర్కొన్నారు.
పుణే మెట్రో రైలు ప్రాజెక్టు దశ-2ను కేబినెట్ ఆమోదించిందని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఈ రెండు ఎలివేటెడ్ కారిడార్లు 12.75 కి.మీ. విస్తరించి ఉంటాయని.. 13 స్టేషన్లు ఉంటాయని తెలిపారు. చాందినీ చౌక్, బవ్ధాన్, కోత్రుడ్, ఖరడి, వాఘోలి వంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న శివారు ప్రాంతాలను కలుపుతాయని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టును నాలుగు సంవత్సరాలలోపు పూర్తి చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. అలాగే జార్ఖండ్లోని ఝారియా బొగ్గు గనుల నిర్వాసితుల పునరావాసానికి (ఝరియా మాస్టర్ ప్లాన్) రూ.5,940 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. నిర్వాసిత కుటుంబాలకు ఆర్థిక స్వావలంబన కల్పించడం కోసం నైపుణ్య శిక్షణ, స్థిరమైన ఉపాధి అవకాశాలను కల్పించనున్నట్లు పేర్కొన్నారు.
ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలోని సింగ్నాలో దక్షిణాసియా ప్రాంతీయ కేంద్రం ఆఫ్ ది ఇంటర్నేషనల్ పొటాటో సెంటర్ (CIP) ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీనికి రూ. 111.5 కోట్లు కేటాయించింది. ఆహారం, పోషకాహార భద్రత, రైతుల ఆదాయం, ఉపాధి కల్పనను పెంచడం దీని ప్రధాన ప్రధాన లక్ష్యం. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బంగాళాదుంప ఉత్పత్తి చేస్తున్న దేశం భారత్ కాగా.. ఇందులో ఉత్తరప్రదేశ్ ముందువరుసలో ఉన్నది. పొటాటో సెంటర్ ఏర్పాటుతో బంగాళాదుంప ఉత్పత్తి, ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, రవాణా, మార్కెటింగ్, విలువ గొలుసులో గణనీయమైన ఉపాధి అవకాశాలను సృష్టించే సామర్థ్యం పెరుగుతుందని పేర్కొన్నారు. అలాగే, యూపీలో ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. యూపీ గౌతమ్బుద్ధనగర్లో రూ.417కోట్లతో ఈఎంసీ క్లస్టర్ ఏర్పాటు చేయనున్నది కేంద్రం.