న్యూఢిల్లీ, సెప్టెంబర్ 16: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్వో) పరిధిలోకి తప్పనిసరిగా రావడానికి వర్తించే వేతన పరిమితిని నెలకు రూ.15,000 నుంచి రూ.25,000కు పెంచాలన్న కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. ఈ చర్యవల్ల అదనంగా 51 లక్షల మందికి పైగా ఉద్యోగులు తప్పనిసరి ఈపీఎఫ్ఓ పరిధిలోకి వస్తారని, తద్వారా కార్మికులకు సామాజిక భద్రతా వలయం విస్తరిస్తుందని మంత్రిత్వ శాఖ అంచనా వేసింది. 2004, 2014 మధ్య ఈపీఎఫ్వో వేతన పరిమితిలో ఎటువంటి మార్పు లేదు. 2014 సెప్టెంబర్లో దీన్ని రూ.15,000కు పెంచారు. ఈ తాజా నిర్ణయం గరిష్ఠ పరిమితిని ఎప్పటికప్పుడు సవరించే విధానాన్ని అనుసరిస్తున్నది.
కాలక్రమేణా వేతనాల పెరుగుదల, అధిక ఆదాయాలు, వ్యవస్థీకృత రంగంలో ఉపాధి విస్తరణ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈకొత్త రూ.25,000 పరిమితిని నిర్ణయించారు. ప్రస్తుత పరిమితి ప్రకారం నెలకు రూ.15,000 కంటే ఎక్కువ వేతనంతో ఉద్యోగంలో చేరేవారు ఆటోమేటిక్గా ఈపీఎఫ్ పరిధిలోకి రారు. దీని ఫలితంగా వారు తప్పనిసరి ప్రావిడెంట్ ఫండ్ పెన్షన్, సంబంధిత బీమా పరిధికి వెలుపల ఉండిపోవచ్చు. ఈ పరిమితిని రూ.25,000కు పెంచడం వల్ల రూ.15,000 నుంచి రూ.25,000 మధ్య ఆదాయం పొందుతున్న గణనీయ సంఖ్యలో ఉద్యోగులు చట్టబద్ధమైన సామాజిక భద్రతా వ్యవస్థ పరిధిలోకి వస్తారు.