ముంబై, జూన్ 23 (నమస్తే తెలంగాణ): మేఘాలయ హనీమూన్ మర్డర్ ఘటనను మరువకముందే, మహారాష్ట్రలోని పుణెలో అలాంటి ఘటనే మరొకటి వెలుగులోకి వచ్చింది. మేఘాలయ కేసులో పెండ్లయిన తర్వాత ప్రియుడి సాయంతో భర్తను హతమార్చగా, పుణె కేసులో పెండ్లికి ముందే ప్రియుడితో కాబోయే భార్య హత్య చేసింది. కేసు వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని పుణెలో వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ (26)కు, సియా గోయల్ (20)కు పెండ్లి నిశ్చయమైంది. వారిద్దరూ ఈ నెల 18న పుణెలోని చారిత్రాత్మక లోహగఢ్ కోటకు ఔటింగ్కు వెళ్లారు. అక్కడ అగర్వాల్ ట్రెకింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు లోయలో పడి మరణించినట్టు ఆయన కాబోయే భార్య సియా గోయల్ చెప్పడంతో పోలీసులు కూడా ప్రమాదంగానే భావించారు. అయితే మొబైల్ ఫోన్లు, డిజిటల్ రికార్డులను పరిశీలించడంతో పాటు పుణె గ్రామీణ పోలీసులు జరిపిన దర్యాప్తులో సియా గోయల్కు, చేతన్ దరి అనే యువకుడితో సంబంధం కలిగి ఉన్నట్లు వెల్లడైంది. వారిద్దరూ కలిసి కేతన్ను హతమార్చడానికి కుట్ర పన్నినట్టు నిర్ధారించారు. కేతన్తో వివాహ నిశ్చయానికి ముందే సియాకు పుణెకు చేతన్ బాబులాల్ చౌదరి (22)తో సంబంధం ఉంది. దీంతో కేతన్తో పెండ్లి ఇష్టం లేని సియా ప్రియుడితో కలిసి అతని అడ్డు తొలగించాలని నిర్ణయించింది. దీంతో ఔటింగ్ పేరుతో కేతన్ను లోహగఢ్ కోటకు అతడిని తీసుకుని వెళ్లింది. అక్కడికి ప్రియుడిని రప్పించింది. తర్వాత ఇద్దరూ కలిసి కేతన్ను పైనుంచి కిందికి తోసేశారు.
రూ.17 కోట్లతో పెండ్లికి భారీ ఏర్పాట్లు
అగర్వాల్, సియాల పెండ్లి ఈ ఏడాది నవంబర్లో జరుగాల్సి ఉండగా, మొత్తం 17 కోట్ల రూపాయలతో పెండ్లి ఏర్పాట్లు ఘనంగా చేస్తున్నారు. రెండు చార్టర్డ్ విమానాలు బుక్ చేయడంతో పాటు ఒక విలాసవంతమైన రిసార్ట్లో దాదాపు 40 గదులను బుక్ చేశారు. పెండ్లి ఇష్టం లేని సియా..తన పుట్టిన రోజుకు ఒక రోజు ముందు ప్రియుడితో కలిసి కాబోయే భర్తను హతమార్చడానికి కుట్ర చేసి దానిని అమలు చేసింది. తర్వాత వారిద్దరూ అక్కడే పుట్టిన రోజు వేడుకలు కూడా జరుపుకున్నారు.
హత్య చేసి.. ఇన్స్టా పోస్ట్
జూన్ 18న హత్య జరిగిన తర్వాత సియా అతని మృతికి సంతాపం తెలుపుతూ భావోద్వేగభరితమైన ఒక ఇన్స్టా స్టోరీని పంచుకుంది. ‘నా పుట్టిన రోజు నాడు నన్ను వదిలి వెళ్లిపోయావు. నిన్ను ఎంతగా ప్రేమిస్తుండగా, నన్ను ఎందుకు వదిలి వెళ్లావు? నీ ఆత్మకు శాంతి కలుగుకాక’ అని ఆమె తన పోస్ట్లో పేర్కొన్నది. కాగా, ఇండోనేషియాలోని బాలీకి ప్రీ వెడ్డింగ్ షూట్ కార్యక్రమాన్ని కూడా సియానే చెడగొట్టింది. ఎయిర్పోర్టుకు వెళ్లేముందు ఆఖరి క్షణంలో కేతన్ పాస్పోర్ట్ను మాయం చేసింది. దీంతో వారి బాలీ ప్రయాణం అర్ధాంతరంగా రద్దయ్యిందని కేతన్ తండ్రి ఆరోపించారు.
నాలుగు రోజుల క్రితమే హత్యకు విఫలయత్నం
కేతన్ హత్య జరగడానికి నాలుగు రోజుల క్రితమే అతనిపై సియా గోయల్ అదే ప్రదేశంలో హత్య చేయడానికి విఫలయత్నం చేసింది. జూన్ 14న వారు లోహగఢ్ కోటకు రాగా, కొండ అంచున నిలబడి ఉన్న అతడిని సియా గోయల్ తోసి వేసింది. అయితే ఒక చెట్టు అతడి ప్రాణాన్ని కాపాడింది. తాను కేతన్కు సమీపంలో ఒక పామును చూశానని, అతడిని రక్షించడానికే తోసివేశానంటూ తర్వాత సియా బంధువులకు తెలిపింది. ఆ ఘటన తర్వాత గోయల్ తిరిగి అక్కడికి వెళ్లడానికి ఇష్టపడలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే తన పుట్టిన రోజును స్నేహితులతో వేడుకలు జరుపుకుందామని ఆమె అతనిపై పదేపదే ఒత్తిడి తెచ్చి రెండోసారి అక్కడికి తీసుకువెళ్లి ప్రియుడి సహాయంతో హత్య చేసింది.