(స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ)
కేంద్రం, రాష్ట్రంలో బీజేపీ సర్కారు ఉంటే అభివృద్ధి పరుగులు పెడుతుందని కమలం పార్టీ ఊదరగొడుతున్నది. నిరుద్యోగులను తప్పుదోవ పట్టిస్తున్నది. కానీ, బీజేపీ చెప్పేవన్నీ అసత్యపు మాటలేనని మధ్యప్రదేశ్ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ ఖాళీలు నిరూపిస్తున్నాయి. డబుల్ ఇంజిన్.. ట్రబుల్ ఇంజిన్ అని కండ్లకు కడుతున్నాయి. మధ్యప్రదేశ్లోని ప్రభుత్వ శాఖల్లో స్టేట్ కేడర్లో లక్ష ఖాళీలుండగా, జిల్లా స్థాయిలో 2 లక్షలకు పైగా ఖాళీలు ఉన్నాయి. అయినా..సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సర్కారు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నది. 44 శాఖల్లో, ప్రతి శాఖలోనూ వెయ్యికి పైగానే పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
ఒక్క విద్యాశాఖలోనే 45,767 ఖాళీలున్నట్టు అధికారిక లెక్కలు చెప్తున్నాయి. ఆరోగ్యశాఖలో 15,313, గిరిజనశాఖలో 7,780, వ్యవసాయ శాఖలో 4,634, ఉన్నత విద్యాశాఖలో 4,652, సాంకేతిక విద్యాశాఖలో 2,839, అటవీ శాఖలో 2,229 ఖాళీలు, పంచాయతీరాజ్ శాఖలో 2,220, పురాతత్వ విభాగంలో 1,794, పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్లో 1,349, కమర్షియల్ ట్యాక్స్లో 1,311, పట్టణాభివృద్ధి శాఖలో 1,290, ఆర్థిక శాఖలో 1,133, ఆయుష్ విభాగంలో 1,061 ఉద్యోగ ఖాళీలున్నాయి.
21,096 బ్యాక్లాగ్ పోస్టులు
మధ్యప్రదేశ్లో ఖాళీగా ఉన్న బ్యాక్లాగ్ పోస్టులు బీజేపీ సర్కారుకు దళిత, గిరిజనుల అభివృద్ధిపై ఉన్న చిత్తశుద్ధికి నిదర్శంగా నిలుస్తున్నాయి. స్టేట్ కేడర్లోనే 21,096 బ్యాక్లాగ్ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు అధికారిక లెక్కలు చెప్తున్నాయి. విద్యాశాఖలో అత్యధికంగా 15,233 బ్యాక్లాగ్ పోస్టులున్నాయి. గిరిజన శాఖలో 1,141 బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీకి నోచుకోవడం లేదు.
తెలంగాణలో 2 లక్షలకుపైగా భర్తీ..
తెలంగాణ ఏర్పడ్డాక కేసీఆర్ సర్కారు లక్షా 30వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసింది. తాజాగా, 80 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతిలిచ్చింది. అనేక శాఖల్లో నోటిఫికేషన్లు కూడా విడుదలయ్యాయి. ఇన్ని ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నా బీజేపీ నాయకులు సోషల్మీడియాలో అసత్యపు పోస్టులతో నిరుద్యోగులను రెచ్చగొడుతున్నారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో నిరుద్యోగం పెచ్చరిల్లుతుంటే..ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలన్నింటినీ భర్తీ చేస్తున్న తెలంగాణ సర్కారుపై విషం చిమ్ముతున్నారు.