న్యూఢిల్లీ, మార్చి 6: ఉత్తరప్రదేశ్లో రోజురోజుకు నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోతున్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. సెంటర్ ఫర్ మానిటరింగ్ ద ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) విడుదల చేసిన డాటా యూపీలోని నిరుద్యోగుల దయనీయ పరిస్థితులను వెల్లడిస్తున్నది. ఈ రాష్ట్రంలో కొవిడ్ అనంతరం యువ కార్మికుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయినట్టు లెక్కలు తెలియజేస్తున్నాయి. యూపీలో నిరుద్యోగిత శాతం 4.2గా నమోదైంది. ముఖ్యంగా గత నాలుగేండ్లుగా 20-24 ఏండ్ల యువ కార్మికుల సంఖ్య బాగా తగ్గిపోయింది. దీనిని బట్టి చూస్తే వీరికి రాష్ట్రంలో ఉద్యోగావకాశాలు ఏమీ లేవని అర్థం అవుతున్నది.
కొవిడ్కు ముందు యూపీలో యువ కార్మికుల శాతం 41.2 ఉండేదని సీఎంఐఈ తెలిపింది. ఇది కొవిడ్ విజృంభించిన 2020 మే-ఆగస్టు నాటికి గణనీయంగా తగ్గిపోయి 31.3 శాతానికి పడిపోయింది. తర్వాత కూడా ఈ తగ్గుదల కొనసాగింది. 2021 మే-ఆగస్టుకు 27 శాతం, 2022 మే-ఆగస్టుకు 22.5 శాతం, అదే ఏడాది సెప్టెంబర్-డిసెంబర్కు 22.4 శాతం నమోదైంది.
ప్రస్తుతం కొవిడ్ మహమ్మారి నుంచి బయటపడి సాధారణ పరిస్థతులు నెలకొన్నా కొత్త ఉద్యోగాల కల్పన లేకపోవడంతో ఈ తగ్గుదల కొనసాగుతుండటం గమనార్హం. యూపీలో యువతకు ముఖ్యంగా 20-24 ఏండ్ల వారికి ఉద్యోగావకాశాలు బాగా తగ్గిపోయాయని సీఎంఐఈకి చెందిన వ్యాస్ పేర్కొన్నారు. 2019 సెప్టెంబర్-డిసెంబర్ నాటికి రాష్ట్రంలో ఈ వయసు వారి ఉద్యోగిత శాతం 27 ఉండగా, 2022 సెప్టెంబర్-డిసెంబర్ నాటికి అది 17.4 శాతానికి దిగజారిపోయింది. ఇది సంఖ్యాపరంగా చూస్తే ఉద్యోగం దొరకని యువ నిరుద్యోగుల సంఖ్య 1.1 మిలియన్లని ఆయన తెలిపారు.
మహిళలతో పోల్చి చూసినా యూపీలో యువ కార్మికుల, ఉద్యోగిత రేటు బాగా పడిపోయింది. 2019 సెప్టెంబర్-డిసెంబర్ నాటికి 20-24 ఏండ్ల యువతకు ఉపాధి అవకాశాల శాతం 47 శాతం ఉండగా, 2022 సెప్టెంబర్-డిసెంబర్ నాటికి ఇది 27.8 శాతానికి దిగజారిపోయింది. ఇదే 20-24 ఏండ్ల మహిళల్లో 2019లో కేవలం 1.6 శాతం ఉద్యోగితతో ప్రారంభమైంది. అయితే 2022 సెప్టెంబర్-డిసెంబర్ నాటికి ఇది 1 శాతానికి మాత్రమే పడిపోయింది. ఇక పట్టణ ప్రాంతాలతో పోలిస్తే పురుషుల ఉద్యోగిత రేటు గ్రామీణ ప్రాంతాల్లో బాగా తక్కువగా ఉన్నది.