లక్నో : ఉత్తరప్రదేశ్లోని ఘాజీపూర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ట్రక్కు టీ స్టాల్లోకి దూసుకెళ్లడంతో ఆరుగురు వ్యక్తులు దుర్మరణం చెందగా.. పలువురు గాయపడ్డారు. దీంతో కోపోద్రిక్తులైన స్థానికులు డ్రైవర్ను పట్టుకొని చితకబాదారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని డ్రైవర్ను రక్షించి, దవాఖానకు తరలించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహ్మదాబాద్ కొత్వాలీ పరిధిలోని అహిరోలి శివారులోని ఓ టీస్టాల్ వద్ద జనం కూర్చున్నారు. ఉదయం సమయంలో భరౌలీ వైపు నుంచి అతివేగంగా వచ్చిన ఓ ట్రక్కు అదుపు తప్పి టీ స్టాల్లోకి చొచ్చుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా.. ఆసుపత్రికి తరలించారు.
ఇందులో ఇద్దరు చికిత్స పొందుతూ మరణించారు. ఆగ్రహించిన గ్రామస్తులు ట్రక్కు డ్రైవర్ను పట్టుకొని చితకబాదారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని డ్రైవర్ను దవాఖానకు తరలించారు. ఆ తర్వాత గ్రామస్తులు మృతదేహాలను రోడ్డుపైనే ఉంచి.. ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్, ఎస్పీ సంఘటనా స్థలానికి చేరుకొని గ్రామస్తులను శాంతింపజేశారు.