భోపాల్: ‘రైలులో బాంబుంది’.. అంటూ బీజేపీ సీనియర్ నాయకురాలు ఉమా భారతి రైల్వే అధికారులను అలెర్ట్ చేశారు. దీంతో ఢిల్లీ వెళ్లే రైలును రెండు గంటలకుపైగా నిలిపి తనిఖీ చేశారు. అయితే ఎలాంటి అనుమానాస్పద వస్తువు లేదా బాంబును గుర్తించలేదు. కేంద్ర మాజీ మంత్రి ఉమా భారతి మధ్యప్రదేశ్లోని తికమ్గఢ్ నుంచి ఢిల్లీ వెళ్లే రైలులో గురువారం రాత్రి ప్రయాణించారు. ఆ రైలు ఉత్తరప్రదేశ్లోని లలిత్పూర్ సమీపిస్తుండగా రైలులో బాంబ్ ఉన్నట్లు ఆమె అనుమానించారు. అధికారులను అప్రమత్తం చేయగా ఆ రైలును లలిత్పూర్ రైల్వే స్టేషన్లో నిలిపివేశారు.
ఆర్పీఎఫ్, జీఆర్పీ సిబ్బంది కలిసి రాత్రి 9.40 గంటల నుంచి 11.30 వరకు సుమారు రెండు గంటల పాటు రైలు మొత్తాన్ని తనిఖీ చేశారు. అయితే ఎలాంటి బాంబును గుర్తించలేదు. దీంతో రైలు కదిలేందుకు అనుమతించారు. అయితే ఝాన్సీ స్టేషన్లో మరోసారి ఆ రైలును తనిఖీ చేశారు. కాగా, ఉమా భారతి తప్పుడు అలెర్ట్తో ఆ రైలు పలు గంటలు ఆలస్యంగా నడిచింది. దీంతో మిగతా ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.