భోపాల్ : మధ్యప్రదేశ్లో శివరాజ్ సింగ్ చౌహాన్ సారధ్యంలోని బీజేపీ ప్రభుత్వంపై ఆ పార్టీ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం ఉమా భారతి విమర్శలు గుప్పించారు. శివరాజ్ సింగ్ చౌహాన్ మద్యం విధానాన్ని ఆమె తప్పుపట్టారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యం దుకాణాలను తెరవడం పట్ల ఉమా భారతి అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మద్యం సమస్య ముదుకొస్తుందని తాను ఊహించలేదని, ఢిల్లీలో లిక్కర్ సమస్యను తాము లేవనెత్తామని, కానీ మధ్యప్రదేశ్లోనూ మద్యం ఏరులై పారుతోందని దుయ్యబట్టారు.
రెవెన్యూ వసూళ్ల కోసం ఎక్సైజ్ అధికారులకు టార్గెట్లు విధించగా వారు ఎక్కడపడితే అక్కడ మద్యం దుకాణాలను తెరుస్తున్నారు. రామరాజ సర్కార్ ఆలయం గేటు పక్కనే మద్యం దుకాణాన్ని ఎక్సైజ్ అధికారులు అనుమతించేందుకు వెనుకాడకపోవడం పట్ల ఆమె విస్మయం వ్యక్తం చేశారు. ఆలయం సమీపంలో మద్యం దుకాణం ఏర్పాటు చేసి ఆదాయం రాబట్టాల్సిన అవసరం ఏముందని ఉమా భారతి ప్రశ్నించారు. యువత, విద్యార్ధులు, మహిళలను దృష్టిలో ఉంచుకని బీజేపీ పాలిత రాష్ట్రాలు పారదర్శక మదయం విధానాన్ని అనుసరించాలని ఆమె సూచించారు.
మీరు పాలు, గంగాజలం, పెరుగు వంటివి పంపిణీ చేయవచ్చని కానీ మారు ప్రజలకు మద్యం అందిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. మీరు ఎలాంటి రామభక్తి ప్రదర్శిస్తున్నారని కాషాయ సర్కార్ను ఆమె నిలదీశారు. కాగా, గతంలో ఉమా భారతి భోపాల్లోని అయోధ్య నగర్లో మద్యం దుకాణాలకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు.