న్యూఢిల్లీ, జూలై 28: ఉక్రెయిన్- రష్యా యుద్ధం కారణంగా చదువు మధ్యలో ఆపేసి తిరిగి వచ్చిన భారతీయ మెడికల్ విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వం పిడుగు వేసింది. వారికి ఇండియాలోని మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లు ఇవ్వటం సాధ్యంకాదని పార్లమెంటు సాక్షిగా స్పష్టంచేసింది. ‘ఏ ఇతర దేశంలోని మెడికల్ కాలేజీలో చదువు మధ్యలో ఆపేసి వచ్చిన విద్యార్థికీ మన దేశంలోని మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లు ఇచ్చే నిబంధన ఇండియన్ మెడికల్ కౌన్సిల్ చట్టం-1956లోగానీ, నేషనల్ మెడికల్ కమిషన్ చట్టం-2019లోగానీ లేదు.
విదేశాల్లో విద్యనభ్యసించే విద్యార్థులు ‘స్క్రీనింగ్ టెస్ట్ రెగ్యులేషన్స్-2002 పరిధిలోకిగానీ, ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ లైసెన్సియేట్ రెగ్యులేషన్స్-2021 పరిధిలోకిగానీ రారు. వీరికి భారతీయ మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లు ఇవ్వటానికి నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ) ఒప్పుకోదు. అందువల్ల వారికి అడ్మిషన్లు ఇవ్వలేం’ అని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ రాజ్యసభలో లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు. దీంతో దాదాపు నాలుగు నెలలుగా కేంద్రం తమ భవిష్యత్తును కాపాడుతుందని ఎదురుచూస్తున్న 20 వేల మంది విద్యార్థుల భవితవ్యం అంధకారమైంది.
మార్చిలోనే కోరిన సీఎం కేసీఆర్
ఉక్రెయిన్పై రష్యా ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆకస్మికంగా దండయాత్ర మొదలుపెట్టడంతో ఉక్రెయిన్లోని వివిధ యూనివర్సిటీల్లో చదువుతున్న 20 వేల మంది భారతీయ విద్యార్థులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని స్వదేశానికి తిరిగి వచ్చారు. వీరిలో అత్యధికమంది మెడికల్ విద్యార్థులే. వీరి చదువు మెడిసిన్ మొదటి సంవత్సరం నుంచి చివరి సంవత్సరం వరకు వివిధ దశల్లో ఆగిపోయింది.
వీరిలో తెలంగాణ విద్యార్థులు కూడా దాదాపు 700 మంది ఉన్నారు. వీరిలో చాలామంది మధ్యతరగతి విద్యార్థులే. ఉక్రెయిన్లో మెడిసిన్ తక్కువ ఖర్చుతో పూర్తిచేసే అవకాశం ఉండటంతో మన దేశంలో లక్షలకు లక్షలు ఫీజులు కట్టలేనివారు అక్కడి యూనివర్సిటీల్లో అడ్మిషన్లు తీసుకొన్నారు. వీరి తల్లిదండ్రులు తమ జీవితకాల సంపాదనంతా పిల్లల విద్యకోసమే ఖర్చుచేశారు. అలాంటివారిని అనుకోని కష్టం వచ్చినప్పుడు ఆదుకోవాలని మొదట ప్రకటించిన నాయకుడు తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు. ఉక్రెయిన్ నుంచి వచ్చిన తెలంగాణకు చెందిన 700 మంది మెడికల్ విద్యార్థులకు ఇక్కడి కాలేజీల్లో అడ్మిషన్లు ఇస్తే ఉచితంగా చదివిస్తామని మార్చి 15న సాక్షాత్తూ అసెంబ్లీలోనే ప్రకటించారు.
ఈ విద్యార్థుల భవిష్యత్తు ఆగం కాకుండా ఉండేందుకు ప్రత్యేక నిబంధన కింద మనదేశంలోని మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లు ఇవ్వాలని ప్రధాని మోదీకి మార్చి 30న లేఖ కూడా రాశారు. అవసరమైతే మెడికల్ కాలేజీల్లో సీట్లు పెంచాలని కోరారు. అలాంటి నిబంధనలు ఇప్పటివరకు లేకపోతే కేంద్రం చొరవ తీసుకొని కొత్తగా నిబంధనలు రూపొందించాలని సూచించారు. అయినా, కేంద్రంలో ఉలుకూ పలుకూ లేదు. తమ విద్యార్థులకు కూడా దేశంలోని మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లు ఇవ్వాలని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ గతవారం ప్రధానికి లేఖ రాశారు. విద్యా సంవత్సరం వృథా అవుతుండటంతో చాలా రాష్ర్టాలు ఇదేవిధంగా కేంద్రాన్ని అభ్యర్థించాయి. ఎన్ని అభ్యర్థనలు వచ్చినా కేంద్రప్రభుత్వం నాలుగు నెలలుగా పట్టించుకోలేదు. తాజాగా చావు కబురు చల్లగా చెప్పినట్టు విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టింది.
సుప్రీంకు విద్యార్థులు..
యుద్ధం కారణంగా నష్టపోయిన తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కొందరు ఉక్రెయిన్ బాధిత విద్యార్థులు ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ప్రత్యేక కేసుగా పరిగణించి తమకోసం ప్రత్యేక నిబంధనలు రూపొందించేలా కేంద్రాన్ని ఆదేశించాలని సుప్రీంకోర్టులో కూడా పిటిషన్లు వేశారు. అయినా కేంద్రం పట్టించుకోవటం లేదని విద్యార్థులు మండిపడుతున్నారు.