హైదరాబాద్: హైదరాబాద్కు చెందిన ద్విపా డిఫెన్స్ స్టార్టప్ కంపెనీ రూపొందించిన ఉగ్రం-యూ51 రైఫిల్(Ugram Rifle)కు ఆర్మీ, కేంద్ర హోంశాఖ క్లియరెన్స్ ఇచ్చింది. ట్రయల్స్లో ఆ రైఫిల్ సక్సెస్ అయినట్లు కేంద్ర వర్గాలు తెలిపాయి. 7.62×51 ఎంఎం క్యాలిబర్కు చెందిన యుద్ధ రైఫిల్ను కొనుగోలు చేసేందుకు కేంద్ర సాయుధ బలగాలు ఆసక్తిగా ఉన్నట్లు తెలిసింది. డీఆర్డీవోకు చెందిన ఆర్మామెంట్ రీసర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్తో కలిసి ద్విపా స్టార్టప్ కంపెనీ ఉగ్రం రైఫిల్ను సంయుక్తంగా డెవలప్ చేశారు. కేవలం 100 రోజుల్లోనే ఈ రైఫిల్ను డిజైన్ చేసి, డెవలప్ చేసినట్లు తెలిసింది. చాలా వేగంగా అభివృద్ధి చేసిన స్వదేశీ రైఫిల్గా గుర్తింపు పొందింది. ఆర్మీ జనరల్ స్టాఫ్ క్వాలిటేటివ్ రిక్వైర్మెంట్తో పాటు కేంద్ర హోంశాఖ నిర్వహించిన ట్రయల్స్లో ఉగ్రం రైఫిల్కు క్లియరెన్స్ దక్కింది.
ద్విపా డిఫెన్స్ కంపెనీ ఎండీ సిబు జోసెఫ్ మాట్లాడుతూ.. తమ కంపెనీకి 2021లో తయారీ లైసెన్సు వచ్చిందని, తెలంగాణ సర్కారు అందజేసిన 13 ఎకరాల భూమిలో పూర్తి స్థాయి ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, ప్రస్తుతం తమ కంపెనీలో సుమారు వంద స్వదేశీ ఆయుధ వ్యవస్థలను తయారు చేశామని, ఇక ఉగ్రం రైఫిల్ తమ కీలక ఉత్పత్తిగా మారిందన్నారు. విస్తృత స్థాయిలో ఉగ్రం రైఫిల్కు చెందిన రియలబులిటీ, ఎండ్యూరెన్స్ పరీక్షలు జరిగాయని, ఈ రైఫిల్ను ప్రొక్యూర్ చేసుకునేందుకు సీఆర్పీఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బీ, ఎన్ఎస్జీ ఆసక్తిగా ఉన్నట్లు ఆయన చెప్పారు. ఉగ్రం రైఫిల్లో ఆధునిక గ్యాస్ ఆపరేటింగ్ బోల్ట్ సిస్టమ్ ఉన్నది. 4 కేజీల కన్నా తక్కువ బరువు ఉంటుంది. 500 మీటర్ల దూరంలో ఉన్న టార్గెట్ను సమర్థవంతంగా చేధిస్తుంది. ద్విపా డిఫెన్స్ కంపెనీలో అసాల్ట్ రైఫిల్లు, కార్బైన్లు, సబ్ మెషీన్ గన్నులు, లైట్ మెషీన్ గన్నులు, యాంటీ డ్రోన్ సిస్టమ్స్ తయారవుతున్నాయి.