హైదరాబాద్: విద్యార్థులకు యూజీసీ ఫెలోషిప్ల కింద ఇచ్చే ఆర్థిక సాయాన్ని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) పెంచింది. ఇప్పటివరకు జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ (JRF) కింద నెలకు రూ.31 వేల చొప్పున రెండేళ్లపాటు చెల్లించేవారు. దాన్ని ఇప్పుడు రూ.37 వేలకు పెంచారు. సీనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ (SRF) కింద రూ.35 వేలకు బదులు రూ.42 వేలు ఇవ్వనున్నారు.
సావిత్రిబాయి జ్యోతిరావు పూలే ఫెలోషిప్ ఫర్ సింగిల్ గర్ల్ చైల్డ్కు కూడా ఈ ఫెలోషిప్ పెంపు వర్తించనుంది. డీఎస్ కొఠారి పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్ కోసం మూడేళ్లపాటు రూ.47 వేల నుంచి రూ.54 వేల వరకు ఇస్తుండగా.. దాన్ని రూ.58 వేల నుంచి రూ.67 వేలకు పెంచారు. ఈ మొత్తం పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్ చేసే మహిళలతో పాటు ఎస్సీ, ఎస్టీలకు కూడా వర్తిస్తుంది. 2023 జనవరి 1 నుంచి ఈ పెంపు వర్తిస్తుందని యూజీసీ పేర్కొంది.