న్యూఢిల్లీ, జూలై 9 : యూజీసీ-నెట్ జూన్ 2026 పరీక్ష ప్రశ్న పత్రం లీక్ అయిందన్న ఆరోపణతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) మరోసారి విమర్శలను ఎదుర్కొంటున్నది. జూన్ చివరలో జరుగాల్సిన ఈ ఉపాధ్యాయ అర్హత పరీక్షకు సంబంధించిన ప్రశ్న పత్రం ఒక వ్యవస్థీకృత ముఠాకు ముందుగానే అందుబాటులోకి వచ్చిందని, లీక్ అయిన ప్రశ్నల ఆధారంగా అనేక రాష్ర్టాల్లోని అభ్యర్థులకు ప్రత్యేక శిక్షణ(ట్యూటరింగ్) ఇచ్చారని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. హర్యానా విద్యార్థి నాయకులు దీపక్ ధన్ఖర్, అంకిత్ సింగ్ ఫోగట్ సోషియాలజీ పేపర్కు సంబంధించి తీవ్రమైన ఆరోపణలు చేశారు.
2026 జూన్ 29, 30 తేదీలలో జరగాల్సిన పరీక్షల ప్రశ్నాపత్రాలు పరీక్ష ప్రారంభానికి కొన్ని గంటల ముందే లీక్ అయ్యాయని వారు ఆరోపించారు. ధన్ఖర్ విడుదల చేసిన ఒక వీడియోలో సోషియాలజీ పేపర్లోని ప్రశ్నలు కెమెరాలో కనిపించాయి. వీడియోలోని 100 ప్రశ్నల ఒక సెట్ అసలు పేపర్తో సరిపోలిందని ఆయన ఆరోపించారు. బీహార్, ఉత్తర్ ప్రదేశ్, ఢిల్లీకి చెందినవారని భావిస్తున్న 7-8 మంది సభ్యుల ముఠా అభ్యర్థులకు రాత్రిపూట కోచింగ్ తరగతులు నిర్వహించిందని కొందరు విద్యార్థులు పేర్కొన్నారు. ఈ సేవలకు ప్రతిఫలంగా ఒక్కో అభ్యర్థి నుంచి వారు రూ. 2.25 లక్షలు వసూలు చేశారని ధన్ఖర్ ఆరోపించారు.
యూజీసీ-నెట్ పేపర్ లీక్ ఆరోపణలపై లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రధాని, విద్యాశాఖ మంత్రి నుంచి ఎలాంటి జవాబుదారీతనం లేదా చర్యలు ఆశించడం వ్యర్థమని పేర్కొన్నారు.
యూజీసీ-నెట్ 2026 పరీక్ష పేపర్ లీక్పై అభ్యర్థుల నుంచి తీవ్ర ప్రతిస్పందన వ్యక్తమైంది. 2026 జూన్ 29. 30 తేదీల్లో పంపిణీ చేసిన అసలు ప్రశ్నపత్రంతో లీక్ అయినట్లు చెబుతున్న అంశాలను అధికారికంగా సరిపోల్చి విచారణ జరుపాలని ఎన్టీఏను విద్యార్థులు డిమాండ్ చేశారు.