న్యూఢిల్లీ, ఏప్రిల్ 22: కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్(సీయూఈటీ)- యూజీ, నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్(నెట్) రాసే విద్యార్థులకు యూజీసీ శుభవార్త చెప్పింది. ఈ ఏడాది నుంచి ఈ రెండు టెస్టుల్లో స్కోర్ల నార్మలైజేషన్కు ముగింపు పలుకుతున్నట్టు ప్రకటించింది. ‘ఒక సబ్జెక్టుకు ఒకే షిఫ్ట్లో పరీక్షలు నిర్వహించనుండటం వల్ల ఈ ఏడాది నుంచి ఈ రెండు టెస్టులకు స్కోర్ల నార్మలైజేషన్ అవసరం ఉండదు’ అని యూజీసీ చైర్మన్ జగదీశ్ కుమార్ స్పష్టం చేశారు.
ప్రస్తుతం తగినన్ని పరీక్ష కేంద్రాలు అందుబాటులోకి రావడం వల్ల, ఓఎంఆర్ విధానంలో ఒకే రోజు పరీక్ష నిర్వహించే సౌకర్యం అందుబాటులోకి వచ్చిందని ఆయన తెలిపారు. మే 15-24 మధ్య సీయూఈటీ-యూజీ నిర్వహించనున్నారు. 15 సబ్జెక్టులకు ఆఫ్లైన్లో, 48 సబ్జెక్టులకు ఆన్లైన్లో టెస్ట్ ఉంటుంది. జూన్ 16న యూజీసీ-నెట్ పరీక్ష ఆఫ్లైన్లో ఉంటుంది. స్కోర్ల నార్మలైజేషన్ తమ ప్రతిభపై ప్రభావం చూపుతుందని విద్యార్థులు కొంతకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక సబ్జెక్టుకు వివిధ సెషన్లలో విభిన్నమైన ప్రశ్నపత్రాలతో పరీక్ష నిర్వహించి విద్యార్థులకు వచ్చిన స్కోర్లను ఇతరులతో పోల్చడాన్నే స్కోర్ల నార్మలైజేషన్ అంటారు.