చెన్నై : సనాతన ధర్మంపై తన వైఖరిని తమిళనాడు మంత్రి, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) సమర్ధించుకున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఉదయనిధి స్టాలిన్, పీకే శేఖర్బాబుపై చర్యలు తీసుకోవడంలో విఫలమైనందుకు మద్రాస్ హైకోర్టు పోలీసులను విమర్శించిన అనంతరం స్టాలిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. సమాజాన్ని విభజించే ఆలోచనలు, ఏ సిద్ధాంతాన్ని అయినా నిర్మూలించాలనే ఆలోచనలను ప్రేరేపించే హక్కు ఏ వ్యక్తికీ లేదని హైకోర్టు స్పష్టం చేసింది.
అయితే తాను ఎలాంటి తప్పు చేయలేదని, తాను చెప్పింది సరైనదేనని, దీనిపై తాను న్యాయపరంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని ఉదయనిధి స్టాలిన్ తేల్చిచెప్పారు. తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడిఉన్నానని, వాటిని మార్చుకోలేనని స్పష్టం చేశారు. తాను నమ్మే సిద్ధాంతం గురించే మాట్లాడానని, అంబేద్కర్, పెరియార్, తిరుమవలవన్ చెప్పినదాని కంటే తాను ఎక్కువగా ఏమీ మాట్లాడలేదని అన్నారు.
తాము ఎన్నో ఏండ్లుగా సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నామని, అది వందేండ్లకు పైబడిన అంశమని, దాన్ని తాము ఎన్నటికీ వ్యతిరేకిస్తూనే ఉంటామని అన్నారు. కాగా, సనాతన ధర్మం సామాజిక న్యాయం, సమానత్వానికి వ్యతిరేకమని, మలేరియా, డెంగ్యూ, కరోనా వైరస్ వంటి దీన్ని నిర్మూలించాల్సిన అవసరం ఉందని ఈ ఏడాది సెప్టెంబర్లో ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపిన సంగతి తెలిసిందే.
Read More :