ముంబై: మహారాష్ట్రకు చెందిన శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే అసాధారణ సమావేశాలు నిర్వహిస్తున్నారు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ) బృందంతోపాటు, జాతిపిత మహాత్మా గాంధీ ముని మనవడు తుషార్ గాంధీతో ఇటీవల చర్చలు జరిపారు. సీనియర్ నాయకుడు ప్రకాష్ రెడ్డి నేతృత్వంలో సీపీఐ ప్రతినిధి బృందం బుధవారం మాతోశ్రీలో ఉద్ధవ్ ఠాక్రేను కలుసుకుంది. కీలకమైన అంధేరి తూర్పు అసెంబ్లీ ఉప ఎన్నికలో శివసేనకు తమ పార్టీ మద్దతును ప్రకటించింది.
మరోవైపు మహాత్మా గాంధీ ముని మనవడు తుషార్ గాంధీ కూడా బుధవారం ఉద్ధవ్ ఠాక్రేను కలిశారు. బాంద్రాలోని ఉద్ధవ్ ఇంట్లో వారిద్దరూ సమావేశమయ్యారు. తుషార్ గాంధీ చేపట్టిన ‘నఫ్రత్ చోడో, సంవిధాన్ బచావో’ (ద్వేషాన్ని వీడండి, రాజ్యాంగాన్ని కాపాడండి) ప్రచార యాత్రలో పాల్గొనాలని ఉద్ధవ్ ఠాక్రేను ఆయన కోరారు.
కాగా, బీజేపీ మద్దతులో సీఎం అయిన శివసేన రెబల్ నేత ఏక్నాథ్ షిండే వర్గాన్ని ధీటుగా ఎదుర్కొనేందుకు ఉద్ధవ్ ఠాక్రే అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ కుట్రతో శివసేనలో చీలిక ఏర్పడిన తర్వాత తొలిసారి జరుగనున్న అంధేరి తూర్పు నియోజకవర్గం ఉప ఎన్నికపై ప్రధానంగా దృష్టి సారించారు. ఇందులో భాగంగా బీజేపీ వ్యతిరేక వర్గాలను కలుపుకుని ముందుకు సాగుతున్నారు.
ఈ నేపథ్యంలో మాతోశ్రీకి ఒక కమ్యూనిస్ట్ నాయకుడు రావడం, ఉద్ధవ్తో భేటీ కావడం, అంధేరీ ఉప ఎన్నికలో మద్దతు ప్రకటించడం అసాధారణమని రాజకీయ విశ్లేషకులు పేర్కొన్నారు. 1970లో సీపీఐపై తొలి గెలుపుతోనే శివసేన పుంజుకున్న సంగతిని గుర్తు చేశారు.