Shivsena | శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రేకు మరో షాక్ తగిలింది. ఆయన సోదరుడి కుమారుడు నిహర్ ఠాక్రే శుక్రవారం మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండేతో సమావేశమయ్యారు. సీఎం షిండేతో నిహార్ ఠాక్రే భేటీ వల్ల రాజకీయంగా ఒరిగేది పెద్దగా ఉండకపోయినా.. శివసేన వ్యవస్థాపకుడు బాల్ఠాక్రేకు తానే అసలైన వారసుడినని షిండే చెప్పుకోవడానికి వీలు కలుగుతుంది. శివసేనలో ఉద్ధవ్ ఠాక్రేపై తిరుగుబాటు చేసి, మెజారిటీ ఎమ్మెల్యేలను తన వైపుకి తిప్పుకున్నారు షిండే. అటుపై సీఎంగా ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో సీఎంగా బాధ్యతలు చేపట్టారు. నాటి నుంచి శివసేనలో ఉద్ధవ్, షిండే గ్రూపుల మధ్య ఆధిపత్యం కోసం పోరు మొదలైందని తెలుస్తున్నది.
బాల్ ఠాక్రేకు ముగ్గురు కొడుకులు బిందుమాధవ్, జయ్దేవ్, ఉద్ధవ్. నిహార్ ఠాక్రే.. ఉద్ధవ్ ఠాక్రే పెద్దన్న బిందు మాధవ్ ఠాక్రే తనయుడు. బిందుమాధవ్ 1996లో రోడ్డు ప్రమాదంలో మరణించారు. జయ్దేవ్ ఠాక్రే ఒక సినిమా నిర్మాత.. రాజకీయాలతో జయ్దేవ్ దూరం. కానీ బిందుమాధవ్ ఠాక్రే తనయుడు నిహార్ ఇప్పుడు సీఎం ఏక్నాథ్ షిండేతో భేటీ అయ్యారు. ఇంతకుముందు జయ్దేవ్ ఠాక్రే మాజీ భార్య స్మిత ఠాక్రే కూడా ఇటీవల సీఎం షిండేను కలుసుకున్నారు.
ఉద్ధవ్ ఠాక్రే మినహా బాల్ఠాక్రే కుటుంబ సభ్యులెవరూ రాజకీయాలతో ఆసక్తి చూపేవారు కాదు. 2012లో బాల్ఠాక్రే మరణం తర్వాత కొన్ని వివాదాలు కొనసాగాయి. ఇక నిహార్ ఠాక్రే.. బీజేపీ నాయకుడు హర్షవర్దన్ పాటిల్ కూతురు అంకితా పటేల్ను గతేడాది డిసెంబర్లో పెండ్లి చేసుకున్నారు.