ముంబై, జూలై 1: ఏక్నాథ్ షిండే ‘శివసేన సీఎం’ కాదని ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. పార్టీని మోసం చేసిన వాళ్లు ఎన్నటికీ శివసైనికులు కారని పేర్కొన్నారు. రెండేండ్ల కింద తమను మోసం చేసిన పార్టీ, శివసేనను వెన్నుపోటు పొడిచిన పార్టీ.. ఇప్పుడు ఏక్నాథ్ షిండేను ‘శివసేన సీఎం’ అని పిలుస్తూ పార్టీ కార్యకర్తలను గందరగోళానికి గురిచేస్తున్నదని బీజేపీని ఉద్దేశించి విమర్శించారు. సీఎం పదవికి రాజీనామా చేసిన అనంతరం ఆయన తొలిసారిగా శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. డిప్యూటీ సీఎం పదవి తీసుకొని బీజేపీ ఏం సాధించిందని ప్రశ్నించారు. ‘శివసైనికుడికి సీఎం పీఠం ఇచ్చామని చెప్పుకొంటున్న బీజేపీ 2019లో ఎందుకు మాట తప్పింది’ అని అడిగారు. బీజేపీ మాట తప్పి ఉండకపోతే మహా వికాస్ అఘాడీ కూటమి ప్రస్తావనే వచ్చేది కాదని పేర్కొన్నారు. షిండేను శివసేన నాయకత్వ పదవి నుంచి ఉద్ధవ్ ఠాక్రే తొలగించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందునే ఈ నిర్ణయం తీసుకొన్నట్టు తెలిపారు.
అయితే, శివసేనలో మెజారిటీ ఎమ్మెల్యేలు తనతోనే ఉన్నారని షిండే అన్నారు. ఉద్ధవ్ వర్గం మైనారిటీలో ఉందన్నారు. రెండున్నరేండ్ల తర్వాత బీజేపీ మహారాష్ట్రలో మళ్లీ అధికారంలోకి రావడంపై దక్షిణ ముంబైలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సంబురాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఫడ్నవీస్ పాల్గొనలేదు. గురువారం నాటకీయ పరిణామాల మధ్య ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేయడం, సంబురాల్లో పాల్గొనకపోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు, బీజేపీకి సంఖ్యా బలం ఉన్నప్పటికీ తనకు సీఎం పదవి అప్పగించడం దేవేంద్ర ఫడ్నవీస్ మాస్టర్ స్ట్రోక్ అని ఏక్నాథ్ షిండే అన్నారు. అలా చేయాలంటే చాలా పెద్ద మనసు ఉండాలని వ్యాఖ్యానించారు.
మెట్రో కార్షెడ్ ఆరే కాలనీలో వద్దు
ముంబై మెట్రో కార్షెడ్ను ఆరే కాలనీలో నిర్మించాలన్న కొత్త ప్రభుత్వం నిర్ణయాన్ని ఉద్ధవ్ ఠాక్రే తీవ్రంగా వ్యతిరేకించారు. శివసేనను మోసం చేసిన బీజేపీ.. మెట్రో కార్షెడ్ విషయంలో ముంబై ప్రజలను కూడా మోసం చేయవద్దన్నారు. ప్రాజెక్టును కంజూర్ మార్గ్లోనే నిర్మించాలని డిమాండ్ చేశారు.
సుప్రీంకు ఉద్ధవ్ వర్గం
రెబెల్ ఎమ్మెల్యేలను అనర్హతపై ఉద్దవ్ ఠాక్రే వర్గం మరోసారి సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఏక్నాథ్ షిండే సహా 16 మంది రెబెల్ ఎమ్మెల్యేలపై అనర్హత విషయం తేలే వరకు వారిని అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకుండా సస్పెండ్ చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే, ఈ పిటిషన్పై అత్యవసరంగా విచారించేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. ఇదే అంశానికి సంబంధించిన ఇతర పిటిషన్లతో కలిపి జూలై 11నే విచారణ చేపడతామని కోర్టు స్పష్టం చేసింది.
ఠాక్రేలు ఎక్కడుంటే అదే శివసేన
ఠాక్రేలు ఎక్కడ ఉంటే అదే శివసేన అని పార్టీ సీనియర్ నేత, ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బృందం ‘స్ప్లిట్ సేన(వేరుపడ్డ సేన)’ అన్నారు. 2019లో బీజేపీ తన మాట నిలబెట్టుకొని ఉంటే ఎంవీఏ కూటమి ప్రస్తావనే వచ్చి ఉండేది కాదన్నారు.