ముంబై : ఆర్ధర్ రోడ్ జైలులో పార్టీ నేత సంజయ్ రౌత్ను కలిసేందుకు శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేకు జైలు అధికారులు బుధవారం అనుమతి నిరాకరించారు. పత్రా చావల్ స్కాంకు సంబంధించి మనీ ల్యాండరింగ్ కేసులో సంజయ్ రౌత్ జైలులో ఉన్నారు. జైలర్ క్యాబిన్లోనే సంజయ్ రౌత్ను కలుస్తానని ఉద్ధవ్ ఠాక్రే కోరినా అనుమతి నిరాకరించారు.
రౌత్ను కలిసేందుకు ఠాక్రేకు అనుమతి నిరాకరించిన జైలు అధికారులు కోర్టు ద్వారనే అనుమతి కోరాలని స్పష్టం చేశారు. జైలర్ క్యాబిన్లో సమావేశం కారాదని పేర్కొన్నారు. జైలు నిబంధనలకు అనుగుణంగా కలవాలని చెప్పారు. మరోవైపు రాజ్యసభ ఎంపీ, శివసేన నేత సంజయ్ రౌత్ జ్యుడిషియల్ కస్టమడీని ముంబై ప్రత్యేక న్యాయస్ధానం సెప్టెంబర్ 19 వరకూ పొడిగించింది.
పత్రా చావల్ మనీ ల్యాండరింగ్ కేసులో రౌతను ఈడీ అరెస్ట్ చేసింది. రూ 1034 కోట్ల కుంభకోణానికి సంబంధించి తొమ్మిది గంటలకు పైగా ప్రశ్నించిన అనంతరం ఆగస్ట్ 1న సంజయ్ రౌత్ను ఈడీ అరెస్ట్ చేసింది.