ముంబై/పాట్నా, జూలై 4: మహారాష్ట్రలో శివసేన పార్టీ లేకుండా చేయడానికి బీజేపీ కంకణం కట్టుకున్నదని ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే విమర్శించారు. సోమవారం శివసేన జిల్లా అధ్యక్షులతో ఆయన మాట్లాడుతూ.. ‘బీజేపీ, ఏక్నాథ్ షిండే వర్గానికి నా సవాల్ ఒక్కటే. దొంగ దెబ్బకొట్టి అధికారంలోకి రావడం కాదు. దమ్ముంటే మధ్యంతర ఎన్నికలు పెట్టండి. ప్రజల్లోకి పోదాం. మేము తప్పు చేసినట్టు ప్రజలు భావిస్తే మమ్మల్ని ఇంటికి పంపుతారు. మీరు తప్పు చేసినట్టు భావిస్తే మిమ్మల్ని ఇంటికి పంపుతారు. సిద్ధమేనా?’ అని సవాల్ విసిరారు.
మరోవైపు, షిండే ప్రభుత్వం ఆరు నెలల్లో కూలిపోవచ్చని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ జోస్యం చెప్పారు. మధ్యంతర ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని క్యాడర్కు పిలుపునిచ్చారు. మహారాష్ట్రలో షిండే ప్రభుత్వం త్వరలో కూలిపోవచ్చని తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ కూడా జోస్యం చెప్పారు. ఇంకోవైపు, మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఎన్సీపీకి చెందిన ఎమ్మెల్యే అజిత్ పవార్ వ్యవహరించనున్నారు. ప్రస్తుతం అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీల సభ్యుల్లో ఎన్సీపీకే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.
విశ్వాస పరీక్షలో నెగ్గిన షిండే
మహారాష్ట్ర అసెంబ్లీలో సోమవారం జరిగిన విశ్వాస పరీక్షలో సీఎం ఏక్నాథ్ షిండే గట్టెక్కారు. అసెంబ్లీలో మొత్తం 287 మంది సభ్యులు ఉండగా.. విశ్వాస తీర్మానానికి అనుకూలంగా 164 మంది ఓటు వేశారు. 99 మంది వ్యతిరేకంగా ఓటు వేయగా.. ముగ్గురు ఓటింగ్కు దూరంగా ఉన్నారు. 21 మంది సభ్యులు హాజరుకాలేదు. వాస్తవానికి సభలో 288 మంది సభ్యులు ఉండగా ఇటీవల ఓ సభ్యుడు మరణించారు. దీంతో ప్రస్తుతం సభ్యుల సంఖ్య 287కు చేరుకుంది. విశ్వాస పరీక్షలో గెలువాలంటే 144 మంది సభ్యుల మద్దతు అవసరం. విశ్వాస పరీక్షలో నెగ్గిన అనంతరం షిండే మాట్లాడుతూ తనను ఎదుగకుండా చాలాకాలం తొక్కేశారని పరోక్షంగా శివసేనను ఉద్దేశించి అన్నారు.
మరో షిండే కోసం..
బీహార్లో మిత్రపక్షాలైన బీజేపీ, జేడీయూ ఏక్నాథ్ షిండే లాంటి నాయకుడి కోసం వెతుకుతున్నాయని లోక్జన్శక్తి పార్టీ మాజీ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ ఆరోపించారు. ‘పైకి మీరిద్దరు మిత్రుల్లాగే కనిపిస్తున్నారు. కానీ లోపల ఎవరి ప్రణాళికలు వాళ్లకు ఉన్నాయి. మిత్రపక్షాన్ని బలహీన పర్చేదెలా? అని ఇటు బీజేపీ, అటు జేడీయూ తరుచు ఆలోచిస్తున్నాయి’ అని తెలిపారు.