న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో గెలిచిన ఇద్దరు కాంగ్రెస్ కౌన్సిలర్లు ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. ముస్తఫాబాద్ వార్డు (వార్డు నంబర్ 243) నుంచి గెలిచిన సబీలా బేగం, బ్రిజ్పురి వార్డు (వార్డు నంబర్ 245) నుంచి గెలిచిన నజియా ఖాటూన్ ఆప్ తీర్థం పుచ్చుకున్నారు.
ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 250 వార్డులకుగాను 134 వార్డుల్లో జయకేతనం ఎగురవేసింది. మొన్నటిదాక అధికారంలో ఉన్న బీజేపీ 104 వార్డులతో సరిపెట్టుకుంది. కాంగ్రెస్ కేవలం 9 వార్డులతో సింగిల్ డిజిట్కే పరిమితం అయ్యింది. ఇతరులు మూడు వార్డులు గెలుచుకున్నారు.
కాంగ్రెస్ తరఫున గెలిచిన 9 మందిలో ఇప్పుడు ఇద్దరు ఆప్లోకి వెళ్లిపోయారు. దాంతో కాంగ్రెస్ కౌన్సిలర్ల సంఖ్య 7కు తగ్గింది.