లక్నో, సెప్టెంబర్ 15: కిడ్నాపైన తన కూతుళ్లు ఎక్కడున్నారో అంటూ వెతుక్కుంటూ వెళ్లిన ఆ తల్లికి.. బిడ్డలిద్దరూ విగతజీవులుగా, చెట్టుకు వేలాడుతూ కనిపించారు. ఆ దృశ్యం చూడగానే ఆమె గుండె ముక్కలైంది. నా బిడ్డల్ని ఏం చేశారు? ఎందుకు చంపేశారు? చంపేముందు లైంగికదాడికి పాల్పడ్డారా? అని అనుమానపడింది. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోస్టుమార్టం చేయగా ఆమె అనుమానం నిజమే అని తేలింది. బైక్లపై వచ్చిన దుండగులు అక్క(17), చెల్లి(15)ని కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లారు. ఓ చోటుకు తీసుకెళ్లి వాళ్లిద్దరిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. అంతటితో ఆగని ఆ కిరాతకులు వారిద్దరిని చంపేశారు. ఆ మృతదేహాలను తీసుకొచ్చి ఓ చెరుకు తోటలో చెట్టుకు వేలాడదీశారు. ఇదీ ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖీరీ జిల్లాలో బుధవారం జరిగిన అమానవీయ ఘటన. కేంద్ర మంత్రి కుమారుడు రైతుల పైకి వాహనం ఎక్కించి చంపిన దారుణ ఘటన మరువకముందే లఖింపూర్లో మరో దారుణం చోటుచేసుకోవటం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ప్రాథమిక దర్యాప్తు అనంతరం ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకొన్నామని జిల్లా ఎస్పీ సంజీవ్ సుమన్ తెలిపారు. నిందితుల్లో ఒకరు పారిపోతుంటే పోలీసులు కాలిపై కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్నారు.
ఫిర్యాదుకు వెళ్తే బాధిత తల్లిపై పోలీసుల దాడి
తన కూతుళ్లను కిడ్నాప్ చేశారని ఫిర్యాదు చేయటానికి వెళ్లిన బాధిత తల్లిని పోలీసులు చితకబాదారని స్థానిక విలేకరి తెలిపారు. ఆమెను విచక్షణారహితంగా కొట్టి, జుట్టు పట్టుకొని స్టేషన్ బయటకు లాక్కొచ్చారని వెల్లడించారు. ఆ సమయంలో తాను అక్కడే ఉన్నానని పేర్కొన్నారు. కాగా, ఘటన జరిగిన సమయంలో తమ కొడుకులు రేషన్ తీసుకురావటానికి వెళ్లారని నిందితుల్లో నలుగురి తల్లిదండ్రులు చెప్పటం గమనార్హం. ఇదిలా ఉండగా, హంతకులను చంపే వరకు అక్కాచెల్లెళ్ల మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించేది లేదని గ్రామస్థులు తేల్చిచెప్పారు. చివరికి అధికారులు జోక్యం చేసుకొని సర్దిచెప్పి అంత్యక్రియలకు ఒప్పించారు.
బీజేపీపై విపక్షాల మండిపాటు
హత్యాచార ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన విపక్షాలు.. బీజేపీపై నిప్పులు చెరిగాయి. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. గుజరాత్లోని బిల్కిస్బానో కేసు నేరస్థులను విడుదల చేయటాన్ని గుర్తు చేస్తూ.. రేపిస్టులను విడుదల చేసే వారి నుంచి మహిళల భద్రతపై ఏం ఆశిస్తామని వ్యాఖ్యానించారు. బీజేపీ ప్రభుత్వ తప్పుడు విధానాల వల్లే నేరస్థులు భయం లేకుండా తిరుగుతున్నారని బీఎస్పీ అధినేత్రి మాయావతి మండిపడ్డారు.
2014లోనూ ఇలాంటి ఘటనే
లఖింపూర్ ఖీరీ తరహాలోనే 2014లోనూ యూపీలో ఇలాంటి ఘటనే చోటుచేసుకొన్నది. బుదౌన్ జిల్లాలోని కత్రా గ్రామంలో ఇద్దరు దళిత అక్కాచెల్లెళ్లను కిడ్నాప్ చేసిన దుండగులు.. వారిపై గ్యాంగ్ రేప్ చేసి, ఓ చెట్టుకు వేలాడదీశారు.