బన్సీలాల్పేట్, జూన్ 5 : నగరంలోని గాంధీ దవాఖాన ‘ఎబోలా’ ఐసోలేషన్ కేంద్రంలో ఇద్దరు అనుమానితులకు చికిత్స అందిస్తున్నారు. ఆఫ్రికాలోని సుడాన్ దేశం నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి ఇటీవల వచ్చిన ఇద్దరు యువకులను జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రి నుంచి అధికారులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. అందులో ఓ యువకుడి ఆరోగ్యం బాగుండటంతో అతడిని హోమ్ ఐసోలేషన్ కేర్ కోసం ఇంటికి పంపించారు.
మరో సుడాన్ దేశస్తుడికి కూడా గాంధీ ఐసోలేషన్ కేంద్రంలో చికిత్స అందిస్తున్నారు. అతడి రక్త నమూనాలు సేకరించి సీసీఎంబీలోని ప్రయోగశాలకు పంపించామని, ప్రాథమిక పరీక్షల ఫలితాల ఆధారంగా పుణెలోని జాతీయ వైరాలజీ ల్యాబొరేటరీకి పంపించే అవకాశం ఉన్నదని గాంధీ ఆస్పత్రి జనరల్ మెడిసిన్ హెచ్వోడీ ప్రొఫెసర్ ఎల్ సునీల్కుమార్ తెలిపారు. ప్రస్తుతం ఇద్దరి ఆరోగ్య పరిస్థితిని గురించి నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, ఎబోలా అనుమానిత కేసులుగా పరిగణించి అన్ని జాగ్రతలు తీసుకుంటున్నామని ఆయన అన్నారు.