భోపాల్/లక్నో: క్రికెట్ (Cricket) ఆడుతూ వేర్వేరు చోట్ల ఇద్దరు యువకులు మృరణించారు. గుండెపోటు వల్ల వారు చనిపోయినట్లు అనుమానిస్తున్నారు. దీంతో ఆ రెండు కుటుంబాల్లో విషాదం నెలకొన్నది. మధ్యప్రదేశ్లోని ఖర్గోన్ జిల్లా కట్కూట్ గ్రామంలో శనివారం సాయంత్రం కొందరు యువకులు క్రికెట్ ఆడారు. 22 ఏళ్ల ఇందల్ సింగ్ జాదవ్ బంజారా బౌలింగ్ చేస్తుండగా ఛాతిలో నొప్పితో అస్వస్థతకు గురయ్యాడు. అతడ్ని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించాడు. ఆ యువకుడు గుండెపోటు వల్ల చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు పోస్ట్మార్టం తర్వాత యువకుడి మృతదేహాన్ని అతడి కుటుంబానికి అప్పగించారు.
కాగా, ఉత్తరప్రదేశ్లోని అల్మోరా జిల్లాలో కూడా ఇలాంటి సంఘటన జరిగింది. క్రికెట్ ఆడిన తర్వాత ఒక యువకుడు చనిపోయాడు. హసన్పూర్లోని కాయసాటన్ ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల ప్రిన్స్ సైనీ 10వ తరగతి చదువుతున్నాడు. శనివారం అతడు తన స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడాడు. మ్యాచ్ ముగిసిన వెంటనే ఆ యువకుడు చల్లని నీరు తాగాడు. ఆ వెంటనే స్పృహతప్పి పడిపోయాడు.
మరోవైపు ఈ విషయం తెలిసిన తల్లిదండ్రులు సైనీని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే అతడు అప్పటికే మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. గుండెపోటు వల్ల చనిపోయినట్లు అనుమానించారు. ఆ యువకుడి తల్లిదండ్రుల నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు వెల్లడించారు.