Madhya Pradesh | ఓ ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు సమాజానికి ఆదర్శంగా నిలిచారు. ఎందుకంటే.. వారిద్దరూ రిజిస్ట్రర్ మ్యారేజ్ చేసుకున్నారు. అంతే కాదు.. ఒక్క రూపాయి కూడా కట్నం తీసుకోలేదు. ఆ డబ్బుతో పేద పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలని సంకల్పించారు. ప్రస్తుతం ఈ ప్రభుత్వ ఉద్యోగుల ఆదర్శ వివాహం వైరల్ అవుతోంది.
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో సీఐడీ సబ్ ఇన్స్పెక్టర్గా పంకజ్ సూర్యవంశీ విధులు నిర్వర్తిస్తున్నారు. విజేత అనే యువతి సియోనీ జిల్లాలో కో ఆపరేటివ్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్గా ఉద్యోగం చేస్తున్నారు. అయితే వీరిద్దరికి బుధవారం వివాహం జరిగింది. అదేదో మీరు అనుకున్నట్లు అంగరంగ వైభవంగా వివాహం జరగలేదు. చాలా సింపుల్గా రిజిస్ట్రర్ మ్యారేజ్ చేసుకున్నారు.
బ్యాండ్, బాజా, బరాత్ లేనే లేదు. కట్నం, గిఫ్ట్స్ తీసుకోలేదు. చివరకు పెళ్లికార్డులు కూడా ముద్రించలేదు. ఎలాంటి దుబారా ఖర్చు చేయకుండా, సాదాసీదాగా వివాహం కానిచ్చారు. ఇక ఈ పెళ్లికి వధూవరుల కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు.
ఈ సందర్భంగా నూతన వధూవరులు మాట్లాడుతూ.. ఇలా పెళ్లి చేసుకోవడం గుర్తుండి పోతుంది. మేమిద్దం కలిసి పంకవి ఫౌండేషన్, ఏక్తా లైబ్రరీ ఏర్పాటు చేశాం. ఈ సంస్థల ద్వారా అమ్మాయిలకు మంచి విద్యను అందించాలనేది మా ఉద్దేశం. అయితే మా వివాహానికి అయ్యే ఖర్చును పేద విద్యార్థుల చదువుకు వినియోగించాలనే ఉద్దేశంతోనే, చాలా సింపుల్గా పెళ్లి చేసుకున్నామని తెలిపారు. పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే అమ్మాయిలకు తప్పకుండా మా వంతు సహాయం చేస్తామన్నారు.
పంకజ్, విజేత ఇద్దరు కూడా రైతు కుటుంబాలకు చెందిన వారు కావడం విశేషం. ఎన్నో సమస్యలను, కష్టాలను అధిగమించిన వీరిద్దరూ ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి, ఇప్పుడు ఆదర్శ వివాహం చేసుకుని, ఎంతో మందికి ప్రేరణగా నిలిచారు.