పోరుబందర్: గుజరాత్ రాష్ట్రంలోని పోరుబందర్ జిల్లాలో దారుణం జరిగింది. దగ్గు తగ్గడంలేదని ఓ రెండు నెలల చిన్నారి ఒంటిపై కాల్చిన ఇనుప రాడ్తో వాతలు పెట్టారు. దాంతో బాలిక పరిస్థితి మరింత క్షీణించి ఆస్పత్రి పాలైంది. ఆస్పత్రిలో బాలిక ఒంటిపై వాతలు గమనించిన వైద్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు బాలికకు వాతలు పెట్టిన నాటు వైద్యుడితోపాటు, ఆ నాటు వైద్యుడి దగ్గరికి బాలికను తీసుకెళ్లిన తల్లిని కూడా అరెస్ట్ చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. పోరుబందర్ జిల్లాలోని ఓ గ్రామంలో రెండు నెలల బాలికకు దగ్గులేసింది. దాంతో చిన్నారి తల్లిదండ్రులు స్థానిక క్లినిక్లో చూపించారు. అయినా తగ్గకపోవడంతో చిన్నారి తల్లి స్థానికంగా ఉండే ఓ నాటు వైద్యుడి దగ్గరికి తీసుకెళ్లింది. బాలికను పరీక్షించిన నాటు వైద్యుడు ఓ ఇనుప చువ్వను కాల్చి బాలిక ఛాతీపైన, పొట్టపైన వాతలు పెట్టాడు.
అయినా దగ్గు తగ్గకపోగా వాతల తాలూకూ నొప్పితో చిన్నారి నరకయాతన అనుభవించింది. దాంతో చిన్నారి తల్లిదండ్రులు తనను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ బాలికను పరీక్షించిన వైద్యులు ఒంటిపై వాతలు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. బాలికను నాటు వైద్యుడికి దగ్గరికి తీసుకెళ్లిన తల్లిని, నాటు వైద్యుడిని అదుపులోకి తీసుకున్నారు.
వారిపై ఇండియన్ పీనల్ కోడ్లోని సెక్షన్ 324 ప్రకారం కేసు నమోదు చేశారు. కాగా, ప్రస్తుతం బాధిత బాలిక ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నదని పోరుబందర్లోని భవ్సింగ్జీ జనరల్ హాస్పిటల్ వైద్యులు తెలిపారు.