కొత్తగూడెం క్రైం: ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి. ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతిచెందినట్లు సమాచారం. వివరాలిలా ఉన్నాయి. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా దుర్దా పరిధిలోని అటవీ ప్రాంతంలో డీఆర్జీ, సీఆర్పీఎఫ్ భద్రతాబలగాల సంయుక్త ఆధ్వర్యంలో సెర్చింగ్ ఆపరేషన్ జరుగుతుంది. ఈ క్రమంలో ఉదయం సుమారు 6గంటల సమయంలో బలగాలకు మావోయిస్టులు తారసపడి కాల్పులకు దిగారు.
వెంటనే అప్రమత్తమైన జవాన్లు మావోయిస్టులపై ఎదురు కాల్పులు జరిపారు. భద్రతా బలగాల ధాటికి తాళలేక మావోయిస్టులు కాల్పులు జరుపుతూనే దట్టమైన అటవీ మార్గంలోకి పారిపోయారు. ఇరువర్గాల మధ్య సుమారు ఇరవై నిమిషాల పాటు భీకర పోరు జరిగినట్లు తెలుస్తోంది.
కాల్పుల విరమణ అనంతరం భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకొని గాలింపులు ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో ఘటనాస్థలంలో ఎదురుకాల్పుల్లో మృతిచెందిన ఇద్దరు మహిళా మావోయిస్టుల మృతదేహాలతో పాటు ఆయుధ, వస్తు, సామగ్రిని భద్రతా బలగాలు స్వాధీనపర్చుకున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు బీజాపూర్ పోలీస్ ఉన్నతాధికారులు అధికారికంగా ధృవపర్చాల్సి ఉంది.