అనంత్నాగ్: జమ్ముకశ్మీర్లోని అనంత్నాగ్లో (Anantnag) ఎన్కౌంటర్ (Encounter) కొనసాగుతున్నది. బుధవారం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడటంతో ఇద్దరు ఆర్మీ అధికారులు, ఓ పోలీస్ అధికారి వీరమరణం పొందిన విషయం తెలిసిందే. అదే ప్రాంతంలో ఇద్దరు లష్కరే తొయిబాకు (LeT) చెందిన ఉగ్రవాదులను (Terroists) చుట్టుముట్టినట్లు కశ్మీర్ జోన్ పోలీసులు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. వారిలో ఒకరు ఉజైర్ ఖాన్ (Uzair Khan) అనే టెర్రరిస్టు కూడా ఉన్నాడని చెప్పారు.
‘ప్రస్తుతం కొనసాగుతున్న ఎన్కౌంటర్ను ముందుండి నడిపించి ముష్కరుల కాల్పుల్లో ప్రాణాలొదిలిన కర్నల్ మన్ప్రీత్ సింగ్, 19 రాష్ట్రీయ రైఫిల్స్ కమాండింగ్ అధికారి మేజర్ ఆశిష్ దోనక్, డిఎస్పీ హుమయూన్ భట్లకు ఘనంగా నివాళులర్పిస్తున్నాం. ప్రస్తుతం ఇద్దరు ఎల్ఈటీ ఉగ్రవాదులను చుట్టుముట్టాం’ అని సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేశారు.
బుధవారం నాటి దాడికి నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా ఈ దాడికి బాధ్యత వహించిన విషయం తెలిసిందే. అనంతనాగ్ జిల్లాలోని కోకోరెనాగ్ కొండ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో మంగళవారం సాయంత్రం ఆర్మీ గాలింపు చేపట్టింది. బుధవారం ఉదయం ఉగ్రవాదులు ఒక్కసారిగా బలగాలపై దాడులకు తెగబడ్డారు. దీంతో కర్నల్ మన్ప్రీత్ సింగ్ తీవ్రంగా గాయపడ్డారు. ఆర్మీ బలగాలు, ఉగ్రవాదులకు జరిగిన ఎదురుకాల్పుల్లో మేజర్ ఆశిష్, డీఎస్పీ భట్ కూడా గాయాలపాలయ్యారు. దీంతో వారిని సమీపంలోని దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ ముగ్గురు అధికారులు ప్రాణాలు విడిచారు. ఈ కాల్పుల ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.