Farmers Protest | కేంద్రం ప్రతిపాదనలకు రైతులు నిరాకరిస్తూ ఆందోళన మరింత ఉధృతం చేశారు. హైడ్రాలిక్ క్రేజలు, జేసీబీలు, ప్రొక్లెయినర్స్ తదితర భారీ యంత్రాలను శంభు సరిహద్దులకు తరలించారు. దాంతో పోలీసులు రైతులను అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో రైతులు, పోలీసుల మధ్య ఘర్షణ కాల్పులకు దారి తీసింది. ఈ ఘటనలో ఇద్దరు రైతులు ప్రాణాలు కోల్పోయారు. జింద్ డేటా సింగ్ వాలా సరిహద్దులో జరిగిన ఘర్షణలో మరో 20 మంది వరకు రైతులు గాయాలపాలయ్యారు.
పోలీసులు పలువురు రైతులను అరెస్టు చేసి హర్యానాకు తరలించారు. ఈ క్రమంలో రైతులపై పోలీసులు లాఠీలు ఝుళిపించారు. పలువురు రైతులు పొలాల గుండా సరిహద్దు దాటేందుకు యత్నిస్తుండగా పోలీసులు లాఠీచార్జి చేశారు. ఓ వైపు భాష్పవాయుగు గోళాలను ప్రయోగించారు. మరో వైపు శంభు సరిహద్దుల్లో రైతుల చర్చలు కొనసాగుతున్నాయి. ఇటీవల చండీగఢ్లో జరిగిన సమావేశంలో కేంద్రం మంత్రులు చేసిన ప్రతిపాదనలు రైతు సంఘాలు తిరస్కరించాయి. ఈ క్రమంలోనే కేంద్రమంత్రి అర్జున్ ముండా రైతులను చర్చలకు ఆహ్వానించారు.
రైతులతో చర్చలకు సిద్ధంగా ఉన్నామని.. రైతులను చర్చలకు ఆహ్వానిస్తున్నామన్నారు. కనీస మద్దతు ధర, పంట మార్పిడి, వ్యర్థాల దహనంపై రైతులతో చర్చకు సిద్ధమని ప్రకటించారు. అయితే, కేంద్రంతో చర్చల విషయంలో రైతు సంఘాలు ఏకగ్రీవంగా సమ్మతించడం లేదు. పలువురు రైతు నేతలు చర్చలకు సిద్ధమైనా.. ఇప్పటి వరకు ప్రభుత్వంతో జరిపిన చర్చల్లో ఏ సమస్య పరిష్కారం కాలేదని మరికొందరు నేతలు పేర్కొంటున్నారు. అయితే, చాలామంది రైతులు శాంతియుతంగా నిరసన తెలుపుతున్నా.. యువ రైతులు మాత్రం పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను దాటేందుకు ప్రయత్నిస్తున్నారు.