Odisha | భువనేశ్వర్ : ఒడిశాలోని బోలన్గిర్ జిల్లాలో శుక్రవారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం జరిగింది. బాద్మల్లోని ఓ ఆయుధాల తయారీ పరిశ్రమలో పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి ఇద్దరు సీనియర్ ఉద్యోగులు తీవ్రంగా గాయపడ్డారు. బాంబుల తయారీకి రసాయనాలు కలుపుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. గాయపడ్డ ఇద్దరు ఉద్యోగులను రూర్కెలా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
గాయపడ్డ ఉద్యోగులను సరోజ్ పాండా, గౌతమ్ మహానంద్గా పోలీసులు గుర్తించారు. ముఖం, కళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. వీరిద్దరూ కూడా సీనియర్ టెక్నిషీయన్స్.
గత నెల 6వ తేదీన ఒడిశాలోని ఖుర్దా జిల్లాలోని ఓ బాణాసంచా పరిశ్రమలో పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. ఈ పేలుడు ధాటికి నలుగురు కార్మికులు చనిపోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడిన విషయం విదితమే.