చెన్నై : తమిళనాడులోని మధురైలో శనివారం జరిగిన చితిరై వేడుకల్లో అపశృతి చోటుచేసుకున్నది. వేడుకలకు పెద్ద సంఖ్యలో భక్తులు రాగా తొక్కిసలాట జరిగింది. ప్రమాదంలో ఇద్దరు భక్తులు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు, తీవ్రంగా గాయపడ్డ వారికి రూ.2లక్షలు, స్వల్ప గాయాలకు గురైన వారికి రూ.లక్ష చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు.
ఇదిలా ఉండగా.. కొవిడ్ మహమ్మారి కారణంగా దాదాపు రెండు సంవత్సరాలుగా చితిరై వేడుకలు నిర్వహించడం లేదు. కేవలం ఏకాంతంగా ఆలయంలో నిర్వహిస్తూ వచ్చారు. ప్రస్తుతం కొవిడ్ మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో ఆంక్షలు సడలించిన నేపథ్యంలో గతంలో నిర్వహించిన తరహాలోనే నిర్వహిస్తున్నారు. ఈ నెల 12న ఉత్సవాల ప్రారంభం కాగా.. ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో మధురై నగరానికి తరలివస్తున్నారు. ఈ క్రమంలో శనివారం ఉదయం పెద్ద సంఖ్యలో భక్తులు పోటెత్తగా.. తొక్కిసలాట చోటు చేసుకున్నది.
60 సంవత్సరాల మహిళతో పాటు మరో వ్యక్తి తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయారు. మరో 24 మంది వరకు తీవ్ర గాయాలకు గురవగా.. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నది. మృతుల కుటుంబాలను మంత్రి పీ మూర్తి, కలెక్టర్ అనిష్ శేఖర్ పరామర్శించి, సానుభూతి ప్రకటించారు. మృతుల్లో ఒకరిని తేనికి చెందిన సెల్వంగా గుర్తించినట్లు మంత్రి తెలిపారు. మహిళ వివరాలు తెలియరాలేదని పేర్కొన్నారు.