న్యూఢిల్లీ: కేరళలో శబరిమల రైల్వే ప్రాజెక్టు(Sabari rail project)కు చెందిన కొన్ని అంశాలను ఇవాళ లోక్సభలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఎన్నో ఏళ్ల నుంచి ఆ ప్రాజెక్టు గురించి స్టడీ చేస్తున్నా ఎటువంటి ప్రగతి సాధించలేకపోయామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం అందడంలేదన్నారు. అయితే శబరిమలకు రైల్వే ట్రాక్ విషయంలో రెండు ప్రత్యామ్నాయ మార్గాల గురించి ఆలోచిస్తున్నామని మంత్రి తెలిపారు. శబరిమల ఆలయానికి వెళ్లే భక్తుల కోసం ఈ రైలు మార్గాన్ని వేయాలని చాన్నాళ్లుగా డిమాండ్ ఉంది. భూసేకరణ, నిధుల కేటాయింపుల్లో రాష్ట్ర సర్కారు సహకరించడం లేదని మంత్రి తెలిపారు.
శబరిమల వరకు రెండు మార్గాల గురించి స్టడీ చేస్తున్నామని, ఒక రూట్లో పంబ వద్దకు వెళ్లే రూటు గురించి ఆలోచిస్తున్నామన్నారు. మరో రూట్లో ఆలయానికి 25 కిలోమీటర్ల దూరం వరకు రైలు వెళ్లే మార్గాన్ని స్టడీ చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. రెండు మార్గాల గురించి సంపూర్ణంగా అధ్యయనం చేసిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని వైష్ణవ్ చెప్పారు.
చెంగన్నూరు నుంచి పంబ వరకు కొత్త రైల్వే రూటును వేసేందుకు ప్లాన్ చేశారన్నారు. అయితే దీనికి సంబంధించిన డీపీఆర్ సిద్ధం అవుతోందన్నారు. అయితే ఏ మార్గాన్ని ఎంచుకోవాలన్న అంశాన్ని ఫిక్స్ చేసిన తర్వాత శబరి రైల్వే ప్రాజెక్టు పనులు ప్రారంభం అవుతాయని మంత్రి తెలిపారు.