భువనేశ్వర్: సోదర వరుసైన ఇద్దరు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్), నేవీలో అధికారులు. అయితే వారిద్దరూ ఇతర కులాలకు చెందిన మహిళలను పెళ్లి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో గ్రామస్తులు వారిని బహిష్కరించారు. దీంతో ఆ ఇద్దరు రక్షణ దళ అధికారులు చివరకు జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ)ను ఆశ్రయించారు. ఒడిశాలోని గంజాం జిల్లాలో ఈ సంఘటన జరిగింది. పోల్సర పోలీస్ స్టేషన్ పరిధిలోని కలంబ గ్రామానికి చెందిన అరవింద్ కుమార్ ప్రధాన్ భారత వాయు సేన (ఐఏఎఫ్)లో అధికారి. బలాసి కులానికి చెందిన ఆయన ఖండాయత్ కులానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.
కాగా, సోదరుడి వరుసయ్యే వినయ్ కుమార్ ప్రధాన్ ఇండియన్ నేవీలో అధికారిగా పనిచేస్తున్నాడు. ఆయన కూడా కులాంతర వివాహం చేసుకున్నాడు. ఈ ఇద్దరు సోదరులకు ఇటీవల పెళ్లిళ్లు జరిగాయి. అయితే కులాంతర వివాహాలను తీవ్రంగా వ్యతిరేకించే ఆ గ్రామస్తులు వారిద్దరిపై సామాజిక బహిష్కరణ విధించారు. బంధువులెవరూ వారి ఇళ్లకు రావడం లేదు. ఏ కార్యక్రమానికి వారిని పిలువడం లేదు.
మరోవైపు గ్రామస్తులు విధించిన సామాజిక బహిష్కరణ పట్ల ఆ ఇద్దరు సోదరులు కలత చెందారు. రక్షణ దళాల్లో పనిచేస్తున్న అరవింద్ కుమార్, వినయ్ కుమార్ ఈ సామాజిక దురాచారాన్ని వ్యతిరేకిస్తూ జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ)ను ఆశ్రయించారు. గ్రామం మొత్తం తమతో సామాజిక సంబంధాలను తెంచుకోవడంతో తాము శాపగ్రస్తమైన జీవితాన్ని గడుపుతున్నట్లు వాపోయారు. సొంత గ్రామంలోనే ఎవరికీ కాకుండా మిగిలిపోయినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని ఎన్హెచ్ఆర్సీని కోరారు.