న్యూఢిల్లీ: భారత్లో ట్విట్టర్ బ్లూ సేవలు ప్రారంభమయ్యాయి. భారత్ సహా బ్రెజిల్, ఇండోనేషియాలో ఇక నుంచి ట్విట్టర్ బ్లూ సర్వీస్ అందుబాటులో ఉంటుందని ఆ సంస్థ ప్రకటించింది. ట్విట్టర్ బ్లూ కోసం ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారులు నెలకు రూ.900, వెబ్ యూజర్లు నెలకు రూ.650 చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. కొంత రాయితీతో ఏడాదికి రూ.6,800 చెల్లించే వార్షిక ప్లాన్ను కూడా పరిచయం చేసింది. ఈ ప్లాన్ తీసుకున్న వారికి నెలకు రూ.566.67 పడుతుంది. ట్విట్టర్ బ్లూ యూజర్లకు కొన్ని అదనపు ఫీచర్లు ఉంటాయి. వీరు గరిష్ఠంగా 4,000 అక్షరాల వరకు ట్వీట్లు చేయవచ్చు. గతంలో బ్లూ బ్యాడ్జ్లు ఉన్న అకౌంట్లు త్వరలోనే బ్యాడ్జ్లు కోల్పోతాయని ఎలాన్ మస్క్ ఇప్పటికే ప్రకటించారు. ఇక నుంచి బ్లూ బ్యాడ్జ్ కావాలంటే.. డబ్బులు కట్టి ‘ట్విట్టర్ బ్లూ’ సర్వీసు పొందాల్సిందే.