న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణం జరిగింది. నడి వీధిలో అందరూ చూస్తుండగానే ఓ 20 ఏండ్ల వ్యక్తిని ఎనిమిది మైనర్లు అత్యంత కిరాతకంగా పొడిచి చంపారు. ఢిల్లీలోని సంగమ్ విహార్ ఏరియాలో శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. సఫ్దర్ జంగ్ ఆస్పత్రి వైద్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఏడాది క్రితం జరిగిన ఓ కొట్లాటే ఈ హత్యకు కారణంగా తెలుస్తున్నది.
వివరాల్లోకి వెళ్తే.. శనివారం రాత్రి సంగమ్ విహార్ ఏరియాలో ఓ 20 ఏండ్ల వ్యక్తిని ఎనిమిది మంది మైనర్లు రోడ్డుపైకి ఈడ్చుకొచ్చారు. రోడ్డుపై అతడిని చుట్టుముట్టి విచక్షణారహితంగా కత్తులతో పొడిచారు. తీవ్రంగా గాయపడిన బాధితుడిని స్థానికులు సఫ్ధర్జంగ్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఆస్పత్రి యాజమాన్యం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
స్థానికంగా ఉన్న సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు ఎనిమిది మంది నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. నిందితులంతా సంగమ్ విహార్కే చెందిన వారిగా గుర్తించారు. ఏడాది క్రితం జరిగిన ఒక కొట్లాటే ఈ హత్యకు కారణమని ప్రాథమిక విచారణలో తేలిందని చెప్పారు.