చెన్నై: తమిళనాడుకు చెందిన నటుడు, తమిళ వెట్రి కజగం (టీవీకే) చీఫ్ విజయ్ మంగళవారం రాజకీయ వ్యూహకర్త, రాజకీయనేత ప్రశాంత్ కిషోర్తో సమావేశమయ్యారు. (Vijay meets Prashant Kishor) కొత్తగా ఏర్పడిన ఆ పార్టీ ఎన్నికల్లో పోటీకి ఆయన సహకరిస్తున్నట్లు వార్తలొచ్చాయి. దీంతో తమిళనాడు రాజకీయాల్లో ఇది అలజడి రేపింది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలోని అధికార డీఎంకేతో సహా విపక్ష పార్టీలు విమర్శించాయి. విజయ్ ఏసీ గదిలో కూర్చుని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత కిషోర్ను కలవడంపై తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై ఎగతాళి చేశారు. దీనికి బదులు జనంలోకి వెళ్లి ప్రజలను కలిస్తే వారి బాధలు తెలుస్తాయని అన్నారు.
కాగా, వ్యూహకారుల పట్ల ఈ వ్యామోహం ఒక వ్యాధిగా మారిందని నామ్ తమిళర్ కట్చి (ఎన్టీకే) నేత సీమాన్ విమర్శించారు. ‘శరీరంలో కొవ్వు గురించి మీరు విని ఉండవచ్చు. కానీ ఇది డబ్బు వల్ల లావుగా మారుతుంది’ అని ఎద్దేవా చేశారు.
మరోవైపు గతంలో ప్రశాంత్ కిషోర్తో కలిసి పని చేసిన అధికార డీఎంకే భిన్నంగా స్పందించింది. ఎన్నికల వ్యూహాల కోసం తమ పార్టీ కార్యకర్తలపై డీఎంకే ఆధారపడుతుందని ఎంపీ కనిమొళి తెలిపారు. ‘ప్రశాంత్ కిషోర్ ఒక ప్రొఫెషనల్ వ్యూహకర్త. ఆయనను ఎవరు పిలిచినా, వారితో కలిసి పనిచేస్తారు. దీనితో మనకు ఏం సంబంధం? డీఎంకే తన పార్టీ కార్యకర్తల బలంతో ఎన్నికలను ఎదుర్కొంటుంది. సీఎం స్టాలిన్ మనకు చూపించే మార్గం నాయకులంతా అనుసరించే మార్గం. మాకు ఎలాంటి సమస్యలు లేవు’ అని ఆమె అన్నారు.