TVK Chief Vijay : తమిళనాడు (Tamil Nadu) అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) పోలింగ్కు సమయం దగ్గరపడింది. గురువారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. రాష్ట్రమంతటా ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 23న పోలింగ్ నేపథ్యంలో ఇవాళ సాయంత్రంతో ప్రచారం ముగియనుంది. ఈ తరుణంలో టీవీకే అధినేత (TVK chief) విజయ్ (Vijay) తమిళ ప్రజలకు ఒక బహిరంగ లేఖ రాశారు. రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి తనను ఎన్నో శక్తులు అడ్డుకోవాలని చూశాయని, కానీ తాను ఎవరికీ తలవంచే ప్రసక్తే లేదని లేఖలో ఆయన స్పష్టంచేశారు. ఈ మేరకు ఆయన తమిళ ప్రజలకు ఒక బహిరంగ లేఖ రాశారు.
ఫాసిస్టు మనస్తత్వం ఉన్న పార్టీలు లేదా అధికారంతో బెదిరించే శక్తులకు తాను భయపడనని, ప్రజల సంక్షేమమే తన లక్ష్యమని విజయ్ పేర్కొన్నారు. తమిళనాడు ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న డీఎంకే, విధానపరమైన వైరుధ్యాలున్న బీజేపీ వంటి పార్టీలు తనను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఆరోపించారు. తన పార్టీ కేవలం రాజకీయ విభాగం కాదని, అది సామాజిక న్యాయాన్ని కాపాడే కోట అని, ప్రజల గుండెల్లో వెలిగే నిజాయతీ గల నిప్పుకణిక అని ఆయన అభివర్ణించారు. ఏప్రిల్ 23న జరగనున్న ఎన్నికల్లో కుటుంబసమేతంగా వచ్చి ‘విజిల్’ గుర్తుకు ఓటు వేయాలని, మార్పు కోసం పోరాడాలని పిలుపునిచ్చారు.