ఢిల్లీలోని జహంగీర్పూరీ అక్రమ నిర్మాణాల కూల్చివేతను తుర్కమాన్ గేట్ 2022 గా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అభివర్ణించారు. ఈ సందర్భంగా ఆప్, బీజేపీపై తీవ్రంగా మండిపడ్డారు. ”తుర్కమాన్ గేట్2022. 1976 లో ఎలాగైతే అప్పటి ప్రభుత్వం వ్యవహరించిందో, ఇప్పటి ప్రభుత్వం కూడా అలాగే వ్యవహరిస్తుంది. అధికారం అనేది శాశ్వతం కాదు. ఈ విషయాన్ని బీజేపీ, ఆప్ గ్రహించాలి” అంటూ ఒవైసీ ట్వీట్ చేశారు.
తుర్కమాన్ గేట్ అంటే….
1976 లో ఇందిరా గాంధీ హయాంలో తుర్కమాన్ గేట్ దగ్గర వున్న అక్రమ నిర్మాణాలను కూల్చేయాలని ఆదేశించారు. అప్పుడు ఎమర్జెన్సీ సమయం. అయితే అక్రమ నిర్మాణాలను కూల్చడాన్ని స్థానికులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ సమయంలో ప్రజలపై కాల్పులు జరపాలని అప్పటి ప్రధాని ఇందిరా ఆదేశించినట్లు తెలుస్తోంది. అయితే ఎమర్జెన్సీ కారణంగా ఈ ఘటనను మీడియా కవర్ చేయలేకపోయింది.